కుట్రల వలయంలో కొల్లేరు

కుట్రల వలయంలో కొల్లేరు - Sakshi


 సాక్షి, ఏలూరు : ప్రకృతి అందాలకు నిలయం.. వలస పక్షులకు ఆవాలమైన కొల్లేరు అభయారణ్యంలో స్వార్థపరుల కుట్రలు రాజ్యమేలుతున్నాయి. కొల్లేరు సహజత్వాన్ని దెబ్బతీసేలా అక్రమంగా చేపల చెరువులు తవ్వడం ఇక్కడ సర్వసాధారణమైపోయింది. గుర్తొచ్చినప్పుడల్లా వాటిలో కొన్నిటిని ధ్వంసం చేస్తూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. ఈ వ్యవహారాల వెనుక కొందరి స్వప్రయోజనాలున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటు ఉన్నతాధికారులు, ఇటు రాజకీయ నేతల మధ్య నలిగిపోతూ కిందిస్థాయి అధికారులు చివరకు బలిపీఠం ఎక్కుతున్నారు. కుట్రలు, కుతంత్రాలు తెలియని రైతులు చెరువుల్ని లీజుకు తీసుకుని ఆర్థికంగా నష్టపోతున్నారు. కొల్లేరు అభయారణ్యంలో తాజాగా ప్రభుత్వం చేపట్టిన

 ‘మినీ ఆపరేషన్’ వెనుక పెద్ద వ్యవహారమే నడిచి నట్టు సమాచారం. నిజానికి తొలినుంచీ నిడమర్రు ప్రాంతంలో 130 ఎకరాల్లో చెరువుల తవ్వకం వివాదాస్పదం అవుతూనే ఉంది. అనేకమంది అధికారులపై సస్పెన్షన్ వేటు పడుతోంది.

 

 కీలక పాత్రధారి మాజీ మంత్రి బంధువు

 నిడమర్రు వెంకటాపురం పరిధిలోని జిరాయితీ భూముల్లో 130 ఎకారాల పంట పొలాలను 2013 మార్చిలో సుమారు 40 పొక్లెయిన్‌లతో వారం రోజు ల్లోనే 5 చెరువులుగా మార్చి గట్లు వేశారు. అప్పటి మంత్రి బంధువు ఒకరు ముందుండి ఈ వ్యవహారం నడిపారు. ఆయనకు  ఇక్కడ దాదాపు 80 ఎకరాల చెరువులు ఉన్నాయి. ఈ విషయం నాటి కలెక్టర్ వాణీమోహన్ దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించారు. అప్పటి ఏలూరు ఆర్డీవో కె.నాగేశ్వరరావు, డీఎఫ్‌వో జీపీ ప్రసాద్, మత్స్యశాఖ డీడీ కృష్ణమూర్తి విచారణ జరిపారు.

 

 బలిపీఠమెక్కుతున్న అధికారులు

 నివేదిక ఆధారంగా అప్పటి నిడమర్రు ఆర్‌ఐ కె.సూర్య ప్రకాష్, వీఆర్‌వోలు దుర్గారావు, ప్రసాద్‌లను కలెక్టర్ సస్పెండ్ చేశారు. తహసిల్దార్ ఎ.గాం ధీకి చార్జిమెమో ఇచ్చారు. అనంతరం అధికారులు చెరువుల గట్లకు నాలుగు వైపులా గండ్లు కొట్టి భూ యజమానులపై కేసులు పెట్టారు. కొంతకాలం తర్వాత గట్లను భూ యజమానులు తిరిగి పునరుద్ధించారు. దానిని అడ్డుకోలేకపోయినందుకు నాటి డీఎఫ్‌వో జీపీ ఆనంద్‌పై సస్పెన్షన్ వేటుపడింది. ఈలోగా ఎన్నికలు వచ్చాయి. అధికారులు ఎన్నికల హడావుడిలో ఉండగా ఈ చెరువుల్లో లీజుదారులు చేపపిల్లల్ని వేశారు. పరిస్థితిని గమనించిన అటవీశాఖ నిడమర్రు సెక్షన్ అధికారి గంగారత్నం మెటర్నిటీ లీవ్‌పై వెళ్లారు. నిత్యం వివాదంలో ఉండే ఈ స్థానంలో చార్జి తీసుకునేందుకు అధికారులెవరూ ముందుకు రావడం లేదు.  

 

 బడా నేతల రాజకీయాలు

 వెంకటాపురంలో సుమారు 2వేల ఎకరాల చెరువుల్లో చేపల సాగు జరుగుతోంది.  చెరువులకు చేపల మేత తీసుకు వెళ్లాలంటే కాంటూరు పరిధిలోని రోడ్డుమీదుగానే వెళ్లాలి. రాజకీయ జోక్యంతో అటవీ శాఖ బేస్ క్యాంప్ సిబ్బంది ఆ వాహనాల రాకపోకలను అడ్డుకోలేకపోతున్నారు. ఈ కారణంగా ఇటీవల డీఎఫ్‌వో టి.శ్రీనివాసరావుపై సస్పెన్షన్ వేటు పడింది. అయితే ఇక్కడ చేపల చెరువుల అక్రమ తవ్వకాలపై ఓ వ్యక్తి హైకోర్టులో పిటీషన్ వేశారు. తాజాగా ఈ కేసులో కదలిక రావడంతో రాజకీయ నేతలకు అనుగుణంగా నడుచుకుంటున్న ఓ ఉన్నతస్థాయి అధికారిని కాపాడేందుకు హడావుడిగా అటవీ శాఖ అధికారులు ఈ మినీ అపరేషన్ నిర్వహిం చినట్టు సమాచారం. ఇక్కడ చేపల సాగు జరగడం లేదని కోర్టుకు చెప్పడం కోసమే ఇదంతా చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

 నష్టపోతున్న రైతులు

 కొల్లేరులో చేపల చెరువుల తవ్వకాలను పూర్తిగా అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారు. ప్రజాప్రతినిధుల వత్తిడి వల్ల ఎప్పటికప్పుడు చేపల సాగు సాగిపోతోంది. అయితే, నాయకులను నమ్ముకున్న సామాన్య రైతులు ఈ కుట్రలతో కష్టాల పాలవుతున్నారు. చెరువుల్ని ధ్వంసం చేయకుండా అడ్డుకుంటామని వారిచ్చే హామీలు విని సాగు ప్రారంభిస్తున్నారు. పంట చేతికందే సమయానికి అధికారులు చెరువులకు గండ్లు కొట్టేస్తున్నారు. దీనివల్ల పెట్టుబడులు కూడా దక్కక రైతులు అప్పుల పాలవుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రభుత్వం కొల్లేరులో చేపల చెరువుల తవ్వకాలు, అక్రమ చెరువులపై చర్యలపై స్పష్టత ఇవ్వడంతోపాటు పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top