పాపం పండింది

పాపం పండింది - Sakshi


సాక్షి ప్రతినిధి, ఏలూరు : గౌస్ మొహియిద్దీన్.. ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో పొలిటికల్ సైన్స్ లెక్చరర్. ఏలూరు రేంజి పరిధిలో ఈయన పేరు చెబితే చాలు కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అధికారి వరకు సలాం చేయాల్సిందే. ఢిల్లీ యూని వర్సిటీలో చదువుకునే రోజుల్లో అతడి రూమ్ మేట్స్, క్లాస్‌మేట్స్‌లో కొందరు అనంతర కాలంలో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. వారితో గల సాన్నిహిత్యంతో గౌస్ మొహియిద్దీన్ ఏలూరు రేంజి పరిధిలోనే కాకుండా పోలీస్ శాఖలోనే అనధికార పోలీస్ బాస్‌గా ఎదిగిపోయారు. కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ వరకు బదిలీలు, పదోన్నతులు, క్రమశిక్షణ చర్యలు నిలిపివేయించడం.. ఇలా ఏ పని కావాలన్నా ఆయన గుమ్మం తొక్కాల్సిందే. జనవరి 1వ తేదీ వచ్చిందంటే డీఐజీ, ఎస్పీ కార్యాలయాల కంటే ఈయన ఇల్లు

 

 పోలీస్ అధికారులతో కిక్కిరిసిపోయేది. పూల బొకేలు పట్టుకుని పోలీసు అధికారులు గౌస్ ఇంటి వద్ద క్యూ కట్టేవారంటే అతడు ఏ రేంజ్‌లో హవా నడిపించారో అర్థం చేసుకోవచ్చు. జిల్లాకు వచ్చే పోలీస్ ఉన్నతాధికారులు ఈయన ఇంటికి వెళ్లి ఆతిథ్యం స్వీకరించాల్సిందే. ఈ పరిచయాలనే ఆయన పెట్టుబడిగా వాడుకున్నారు. సెటిల్‌మెంట్లు, దందాలు, రియల్ ఎస్టేట్ మోసాలతో గౌస్ భారీగానే వెనకేసుకున్నారు. ఇదే సమయంలో పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురికి విసిరిన వల ఆయన్ని కటకటాల పాల్జేసింది. ‘నూరు గొడ్లను తిన్న రాబందు.. ఒక్క గాలివానకు కొట్టుకుపోయింది’ అని ఓ పోలీస్ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారంటే సదరు గౌస్ అక్రమాల జాబితా ఎంతో.. అతని వ్యవహార శైలి ఎలాంటిదో అవగతం చేసుకోవచ్చు.

 

 పాపం పండిందిలా..

 పోలీస్ శాఖలో ఏ పనైనా గౌస్ ద్వారా సులువుగా అతుందని తెలుసుకుని ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన కొండ్రెడ్డి సూర్యప్రకాశరెడ్డి అతణ్ణి ఆశ్రయించాడు. ఒక నిరుద్యోగికి ఎస్సై ఉద్యోగం ఇప్పించడానికి గౌస్‌కు 2012లో రూ.14 లక్షలు ఇచ్చాడు. ఉద్యోగం రాకపోవడంతో డబ్బులు వెనక్కి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో రూ.3 లక్షలను గౌస్ వెనక్కి ఇచ్చేశాడు. మిగిలిన డబ్బు ఇవ్వలేదు. దీంతోపాటు ఒంగోలులో వివాదంలో ఉన్న ఒక స్థలం విషయంలో సెటిల్‌మెంట్ చేసేందుకు 2013 ఫిబ్రవరిలో రూ.10 లక్షలను సూర్యప్రకాశ్‌రెడ్డి నుంచి తీసుకున్న గౌస్ ఆ పని చేసిపెట్టలేదు. అలాగే గుంటూరు రేంజ్ పరిధిలో ఒక సీఐకి మంచి పోస్టింగ్ ఇప్పిం చడానికి రూ.10 లక్షలను సూర్యప్రకాశ్‌రెడ్డినుంచి గౌస్ తీసుకున్నాడు.

 

 మనీ సర్క్యులేషన్ స్కీమ్ పేరుతో ప్రకాశం జిల్లాలో కోట్లాది రూపాయలను వసూలు చేసి బోర్డు తిప్పే సిన భారత్ ప్రేమసదన్ సంస్థ నుంచి రూ.20 లక్షలు ఇప్పిం చేలా సెటిల్‌మెంట్ చేసేందుకు రూ.5 లక్షలను సూర్యప్రకాశరెడ్డి నుంచి గౌస్ తీసుకున్నాడు. ఈ లావాదేవీలన్నీ గౌస్ తన వ్యాపార భాగస్వామి వెంకటరత్నం ద్వారా నిర్వహించాడు. డబ్బులు ఇచ్చినా ఏ పనీ కాకపోగా, గౌస్ బెదిరింపులకు పాల్పడటంతో  సూర్యప్రకాశ్‌రెడ్డి జిల్లా పోలీసులను ఆశ్రయించారు. దీంతో గౌస్ ఇంటిని భారీ బందోబస్తు మధ్య సెర్చ్ వారెంట్‌తో రెవెన్యూ అధికారులు, వీడియోగ్రాఫర్ల సమక్షంలో తనిఖీలు చేపట్టారు. ఏలూరు డీఎస్పీ సరిత ఆధ్వర్యంలో టూటౌన్ సీఐ వై.సత్యకిషోర్ బుధవారం రాత్రి 8 నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు సోదాలు నిర్వహించారు. అనంతరం గౌస్‌మొహిద్దీన్‌ను అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా వచ్చే నెల 5వరకు రిమాండ్ విధించారు.

 

 గుట్టు రట్టుచేసిన హార్డ్ డిస్క్

 పెద్దమనిషిగా వ్యవహరిస్తూ.. పోలీస్ బాస్‌లతో సార్ అని పిలిపించుకుంటూ.. షాడో బాస్‌గా వ్యవహరించిన లెక్చరర్ గౌస్ గుట్టును అతని కంప్యూటర్‌లోని హార్డ్‌డిస్క్ బట్టబయలు చేసింది.  దానిని తనిఖీ చేసిన అధికారులకు కళ్లు బైర్లుకమ్మే నిజాలు వెలుగు చూశాయి. సెటిల్‌మెంట్లు, దందాలు, పోలీసులకు పదోన్నతులు, అవార్డులు, రివార్డులు, పనిష్మెంట్ వంటి ఎన్నో అడ్డుగోలు వ్యవహారాలకు అతని ఇల్లు కేరాఫ్ అడ్రస్‌గా మారడం పోలీస్ అధికారులనే కంగు తినిపించింది. తనకు నచ్చిన అధికారులకు అవార్డులు, ప్రోత్సాహాకాలు ఇప్పించడానికి తయారు చేసిన విజ్ఞాపన పత్రాలు, మాట వినని పోలీస్ అధికారులపై ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు, సీబీఐకి ఆకాశరామన్న పేరుతో రాసిన ఉత్తరాలు దొరకడం పోలీసులకు విస్మయం కలిగిం చింది. మొత్తంగా ఇతని ఇంటిలో వివిధ కేసులకు సంబంధించి 50కు పైగా డాక్యుమెంట్లు దొరికాయి. గతంలో ఏలూ రు డీఎస్పీగా పనిచేసి క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొన్న అధికారి తనపై చర్యలు నిలుపుదల చేయించుకునేందుకు ఈయనను ఆశ్రయించడం, ఈయన అందుకోసం చేసిన ప్రయత్నాలకు సంబంధించిన పత్రాలు కూడా లభ్యమయ్యాయి.

 

 సీడీ ఫైళ్లు లభ్యం

 ఏలూరు త్రీటౌన్‌కు సంబంధించి రెండు కేసుల్లో పార్ట్-1, పార్ట్-2 సీడీ ఫైళ్లు గౌస్ ఇంట్లో లభ్యం కావడం పోలీస్ శాఖలో చర్చనీయాంశమైంది. వాస్తవానికి చార్జ్‌షీట్ దాఖలు చేసిన తరువాత సీడీ ఫైళ్లకు సంబంధించిన ఒక కాపీను తమ వద్ద ఉంచుకుని మరొక ఒరిజనల్ కాపీని పోలీసులు కోర్టుకు అందచేస్తారు. కాని గౌస్ ఇంట్లో లభ్యమైన సీడీ పైళ్లల్లో చార్జ్ షీట్‌లు దాఖలు కానివి కూడా ఉండటం కలకలం రేపుతోం ది. గౌస్ నుంచి స్వాధీనం చేసుకున్న రెండు మొబైల్స్‌కు సంబంధించి కాల్‌డేటాను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. మూడేళ్ల కాలంలో గౌస్ ఏయే పోలీస్ అధికారులతో సంభాషించారు.. ఇతనికి ఎవరు సహకరించారు తది తర విషయాలన్ని కాల్‌డేటాతో బట్టబయలు కానున్నాయి. ఈ వ్యవహారాలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసేందుకు జిల్లా ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి సిద్ధమవుతున్నారు.

 

 ప్రకాశం ఎస్పీకి లేఖ

 లెక్చరర్‌గా పనిచేసిన గౌస్‌మొహియిద్దీన్ భారీగా ఆస్తులు కూడబెట్టడంపైనా పోలీసులు దృష్టి సారించారు. రాష్ట్ర రాజ ధాని ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటవుతోందంటూ గౌస్ రియల్ ఎస్టేట్ మోసాలకు పాల్పడినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ కేం ద్రంగా ఏర్పడిన సిరిసంపద రియల్ ఎస్టేట్ సంస్థకు గౌస్‌మొహియిద్దీన్ మేనేజింగ్ పార్టనర్‌గా వ్యవహరించాడు. ఏడాది కాలంలోనే కోట్లాది రూపాయల విలువైన 50 ఎకరాలకు పైగా భూమిని క్రయవిక్రయాలు జరిపించారు. ఈ సందర్భంగానే మోసాలకు పాల్పడినట్టు 2013లో ప్రకాశం జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్‌లో సిరిసంపద రియల్ ఎస్టేట్ సంస్థపై కేసు నమోదైంది. అయితే మేనేజింగ్  పార్టనర్‌గా వ్యవహరించిన గౌస్‌ను మాత్రం పోలీసులు విచారించలేదు. ఈ సంస్థలో కొంతమంది పోలీసు అధికారులు కూడా పెట్టుబడులు పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. తాజా ఘటన నేపథ్యంలో సిరిసంపద రియల్ మోసాలపై గౌస్‌ను సైతం విచారించాలని ప్రకాశం జిల్లా ఎస్పీకి పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి లేఖ రాశారు.

 

 విజయవాడ తరలింపు


 ఏలూరు (వన్ టౌన్) : మోసాల కేసులో అరెస్టైన లెక్చరర్ గౌస్ మొహియిద్దీన్‌ను శుక్రవారం సాయంత్రం విజ యవాడలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తాను గుండెపోటుతో బాధపడుతున్నట్టు గౌస్ చెప్పడంతో పోలీసులు తొలుత అతన్ని ఏలూరులోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు.

 

 బాధితులూ.. ఫిర్యాదు చేయండి : ఎస్పీ

 జిల్లాలో గౌస్ చేతిలో మోసపోయిన వారెవరైనా ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి కోరారు. పోలీసు ఉద్యోగాలు, ప్రమోషన్లు, ఇతరత్రా లావాదేవీలతో సొమ్ము చేసుకుంటున్న గౌస్ బాధితులెవరైనా ఉంటే భయపడాల్సిన పనిలేదని, నేరుగా తనను సంప్రదించవచ్చని అన్నారు.  

 

 పోలీసు అధికారుల్లో కలవరం

 గౌస్‌తో సన్నిహితంగా మెలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారుల్లో కలవరం మొదలైంది. కాల్‌డేటా బయటకు రాకుండా ఉండేందుకు సన్నిహిత ఐపీఎస్ అధికారులు జిల్లా అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. ఇప్పటివరకు గౌస్ ఇంటి చుట్టూ చ క్కర్లు కొట్టిన పోలీస్ అధికారుల్లో గౌస్ అరెస్ట్ తరువాత ఆందోళన ప్రారంభమైంది. ఈ కేసు ఎటు తిరిగి ఎటొస్తుందోనంటూ ఆయనతో సన్నిహితంగా ఉన్న పోలీసు అధికారులు భయాందోళనలో ఉన్నారు. ఇదిలా ఉండగా, విచారణ చేయడానికి వీలుగా గౌస్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ టూటౌన్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఏసీబీ కేసు నుంచి బయటపడేస్తానంటూ గౌస్ రూ.80 వేలు తీసుకుని మోసగించినట్టు 2007లోనే ఒక ఉద్యోగి జిల్లా పోలీసులను ఆశ్రయించినప్పటికీ కేసు నమోదు చేయలేదు. ఇప్పుడు ఆ కేసును కూడా తవ్వే పనిలో జిల్లా అధికారులు ఉన్నారు. ఈ వ్యవహారాలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసేందుకు జిల్లా ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి సిద్ధమవుతున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top