నలుగురిని పెళ్లి చేసుకుని..
- కటకటాల్లో నిత్య పెళ్లి కొడుకు
తిరుపతి : ఓ నిత్య పెళ్లికొడుకు బండారం బట్టబయలైంది. అమాయక యువతలను వంచిస్తూ ఏకంగా నలుగురిని ఒకరికి తెలియకుండా ఒకరిని పెళ్లి చేసుకున్నాడు. మూడవ భార్యను వేధించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో బాధిత యువతులు తమను మోసం చేశాడంటూ తిరుపతి ఈస్టు పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని ప్రాధేయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. భాకరాపేట సమీపంలోని కూరపర్తివారిపల్లికి చెందిన నాగభూషణంరాజు (28) తిరుపతి నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్నాడు. ఇతని తల్లి వీరమ్మ అదే గ్రామంలో ఉపసర్పంచ్గా పనిచేస్తున్నారు. వివాహితుడైన నాగభూషణం రాజు పీలేరుకు చెందిన కల్పన అనే యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు, ఈ వివాహాల గురిం చి చెప్పకుండా వెంకటగిరికి చెందిన లక్ష్మిని 2015లో వివాహం చేసుకున్నాడు. ఇప్పటికే ఆమెకు ఏడాది బాబు ఉండగా ప్రస్తుతం ఆమె గర్భవతి. ఇదిలా వుంటే తాజాగా వైఎస్సార్ జిల్లా పులివెందులకు చెందిన కృప అనే యువతి (నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో ట్రైనీ రిసెప్షన్గా పనిచేస్తున్నారు)ని మాయమాటలతో ప్రేమలోకి దించి వివాహం చేసుకున్నాడు.
బరితెగించాడు ఇలా..
నాలుగు వివాహాలు చేసుకున్న నాగభూషణం రాజు మంగళవారం కొర్లగుం టలో నివాసముంటున్న మూడవ భార్య అయిన లక్ష్మి ఇంటికి నాల్గవ భార్య కృపను వెంటబెట్టుకుని వెళ్లాడు. దీంతో లక్ష్మి ఈయువతి ఎవరు అని ప్రశ్నించగా ఈమెను కూడా పెళ్లి చేసుకున్నానని మనమందరం కలిసే ఉందామని లక్ష్మిని మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు. దీంతో లక్ష్మికి నాగభూషణం మధ్య వాగ్వాదం మొదలై ఘర్షణకు దారితీసింది. దీంతో నాగభూషణం లక్ష్మిని చితకబాదాడు. దీంతో సహనం కోల్పోయిన లక్ష్మి మహిళా పోలీసులను ఆశ్రయించింది. విషయం తెలుసుకున్న మహిళా పోలీసులు కేసు ఈస్టు పోలీసులకు అప్పగించారు. దీనిపై ఎస్ఐ ఈశ్వరయ్య చీటింగ్ కేసు నమోదు చేసి నిందితుడని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై బాధితుడ్ని వివరణ కోరగా తనకు నాలుగు పెళ్లిళ్లు కాలేదని నిన్న రాత్రి జరిగిన పెళ్లితో కలసి మూడు పెళ్లిళ్లు మాత్రమే అయ్యాయని బుకాయించాడు. అందరినీ బాగానే చూసుకుంటున్నానని కావాలనే లక్ష్మి తనపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.