2019 కల్లా పోలవరం పూర్తి
► అన్ని జిల్లాలకూ ప్రాజెక్టు ఫలాలు
► ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చంద్రబాబు పవర్పాయింట్ ప్రజెంటేషన్
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ఫలాలను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు అందజేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. 2018 ఖరీఫ్ నాటికి ప్రాజెక్టును పాక్షికంగా పూర్తి చేసి గ్రావిటీ ద్వారా ఆయకట్టుకు నీళ్లందిస్తామని, 2019 నాటికి పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తామని అన్నారు. సోమవారం శాసనసభ, శానసనమండలి విరామ సమ యంలో అసెంబ్లీ కమిటీ హాల్లో ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలకు పోలవరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
తొలుత జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్కుమార్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వ రరావులు ప్రాజెక్టు స్వరూపాన్ని వివరించా రు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడా రు. ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించామని, ఇప్పటివరకు 40.65 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. పట్టిసీమ ద్వారా గోదావరికృష్ణా నదులను అనుసంధానం చేసిన స్ఫూర్తితోనే గోదావరిపెన్నా నదులను అనుసంధానం చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఈ పనులను రెండు దశల్లో చేపడతామన్నారు.
పోలవరం హైడల్ ప్రక్రియ వేగవంతం
పోలవరం జల విద్యుత్ కేంద్రం టెండర్ల ప్రక్రియ వేగవంతమైంది. ఈ అంశంపై సోమవారం విజయవాడలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఏపీ జెన్కో ఎండీ విజయానంద్తో పాటు పలువురు డైరెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గత నెలలో నిర్వహించిన ప్రీబిడ్ సమావేశం ఆధారంగా టెండర్ డాక్యుమెంట్ను ఖరారు చేశారు. కొత్తగా ఏయే నిబంధనలు పొందుపరిచిందీ అధికారులు గోప్యంగా ఉంచారు.