పాస్పోర్ట్ కోసం నకిలీ ధ్రువ పత్రాలు
ఎమ్మిగనూరు రూరల్: అతనో సైనికుడు. అర్ధాంతరంగా ఉద్యోగం మానేశాడు. ఎలాగైన విదేశాలకు వెళ్లాలనే ఉద్దేశంతో పాస్పోర్ట్ పొందేందుకు నకిలీ ధ్రువ పత్రాలు సృష్టించి పోలీసులకు చిక్కిన సంఘటన బుధవారం ఎమ్మిగనూరు పట్టణంలో చోటు చేసుకుంది. పట్ణణ ఎస్ఐ ఇంతియాజ్బాష తెలిపిన వివరాలివీ.. పట్టణంలోని మాచాని వీధికి చెందిన చెన్నారెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు రఘునాథ్రెడ్డి పదో తరగతి వరకు చదువుకున్నాడు. 2001వ సంవత్సరంలో సైన్యలో చేరి 8 సంవత్సరాలు సిపాయిగా పనిచేశాడు. అనంతరం సైన్యంలో అధికారులకు చెప్పకుండా పారిపోయి ఇంటికి వచ్చాడు. అయితే అతని ఒరిజనల్ సరిఫికెట్లు సైన్యం కార్యాలయంలో ఉండటంతో తాను విదేశాలకు వెళ్లేందుకు పాస్పోర్ట్ కోసం నకిలీ ధ్రువపత్రాలను సృష్టించాలనుకున్నాడు.
గడి వేముల జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నట్లు నకిలీ సర్టిఫికేట్ సృష్టించి ప్రధానోపాధ్యాయుడి సంతకం ఫోర్జరీ చేశాడు. ఈ సర్టిఫికేట్ జతపరచి పాస్పోర్టు కోసం ఎస్బీ పోలీసులకు ధరఖాస్తు చేసుకున్నాడు. ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ చంద్ర విచారణలో భాగంగా గడివేముల జెడ్పీ పాఠశాలను సందర్శించగా ఈ పేరుగల విద్యార్థి తమ పాఠశాలలో చదవ లేదని, ఈ టీసీ మేము ఇచ్చింది కాదని అక్కడి హెచ్ఎం తేల్చి చెప్పారు. మోసాన్ని గమనించి ఎస్బీ కానిస్టేబుల్ చంద్ర పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ ఇంతియాజ్బాష నిందితుడి ని అదుపులో తీసుకొని విచారించారు. దీంతో రఘునాథ్రెడ్డి పాస్పోర్ట్ పొందేందుకు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించానని నేరం అంగీకరించాడు. ఈ మేరకు అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. సమావేశంలో పట్టణ ఎఎస్ఐ ఆలీ, పోలీసు సిబ్బంది ఉన్నారు.