మోగింది కల్యాణవీణ
దివ్య మంగళమూర్తి కడప రాయుని కల్యాణ వైభవాన్ని వీక్షించేందుకు ఆ ప్రాంగణంలోని వన్నెల పూలు ఆనందంతో తలలూపుతున్నాయి. కళ్లింతలు చేసుకుని చూస్తున్నాయి. ఆహ్వానిస్తున్నట్లు అరటి పిలకలు, అపురూప ఘట్టానికి తాము సాక్షులుగా నిలిచామని పులకింతలు పోతున్న మావిడాకుల తోరణాలు,.
శ్రీ గంధం, కర్పూరం పరిమళాలు, ‘ శ్రీవారి కల్యాణ శోభను చూతము రారండి’ అంటూ ఆహ్వానిస్తూ, మంగళవాయిద్యాల సుస్వరాలు, వరునిగా నిండైన అలంకారంలో బ్రహ్మాండనాయకుడు. వధువులుగా సమ్మోహనమూర్తులైన శ్రీదేవి, భూదేవి అమ్మవారలు.. ఈ మనోహరమైన ఘట్టాన్ని చూడటానికి రెండు కళ్లు చాలవంటూ ఒళ్లంతా కళ్లుగా చేసుకున్న భక్తజనం, వె రసి అక్కడ అంతా ఆనందం. దేవదేవుని కల్యాణ వైభవం.
కడప కల్చరల్: దేవునికడప శ్రీ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆల య వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆరో రోజు ఆదివారం స్వామి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అభిషేక మూర్తులైన ఉత్సవర్లను పూలు, నగలతో కన్నుల పండువగా అలంకరించి ఓ వైపు స్వామిని, మరో వైపు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను కొలువుతీర్చారు. టీటీడీ డిప్యూటీ ఈవో బాలాజీ, ఆలయ ఇన్స్పెక్టర్ ఈశ్వర్రెడ్డి, పర్యవేక్షణలో ఆలయ అర్చక బృందం కల్యాణ ఘట్టాన్ని కన్నులపండువగా జరిపించారు. ఇరువురు దేవేరులను స్వామికి ఇరు వైపులా చేర్చి ఉల్లాసభరితంగా ‘తలంబ్రాల’ కార్యక్రమం నిర్వహించారు.
టికెట్లు ఉన్నా ఇక్కట్లే..!
కల్యాణం అనంతరం ఉభయదారులకు ప్రసాదాలిచ్చే కార్యక్రమంలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. వారిని మూడు విభాగాలుగా చేసి ప్రసాదం ఇచ్చేందుకు ప్రయత్నించినా వేదిక వద్దకు వెళ్లడంలో క్రమం పాటించకపోవడం, ప్రముఖులు, సాధారణ భక్తులు ప్రసాదాలు, అక్షిం తల కోసం వేదిక వద్దకు రావడంతో ఆ ప్రాంతం లో గందరగోళం నెలకొంది. ఉత్సవాల్లో భాగంగా రాత్రి స్వామిని గజవాహనంపై అలంకరించి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. మాజీ ఛైర్మన్లు పాల్గొన్నారు.