రాష్ట్రాన్ని ముక్కలు చేసింది ఎవరో?
పలమనేరు: రాష్ట్రాన్ని ముక్కలు చేసి దుస్థితికి కారణమైందీ కాకుండా మళ్లీ కొత్త నాటకానికి తెరతీస్తే జనం నమ్మే పరిస్థితిలో లేరని ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఎండగట్టారు. పట్టణ సమీపంలోని గంటావూరు ఇందిరమ్మ కాలనీలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చేసిందంతా చేసి ఇప్పుడు రాష్ట్ర పరిస్థితికి విభజనే శాపమంటూ ప్రజలకు తెలియజేస్తామని చంద్రబాబు చెబుతుంటే చాలా విడ్డూరంగా ఉందన్నారు. అసలు కేంద్రానికి విభజనలేఖ ఇచ్చింది మొ దలు శాశనసభలో జరిగిన అన్ని విషయాలు సీ మాంధ్రులకు తెలియదా అని ప్రశ్నించారు.
మళ్లీ జనాన్ని మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తే జనం ఊరుకోరని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో పాల న అస్తవ్యస్తంగా మారిందని, దీన్ని కప్పిపుచ్చేందుకు ఎన్ని ఎత్తుగడలు వేసినా ఆయన మాటలను జనం నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఎన్నికల సమయంలో లేనిపోని హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చి, వాటిని అమలు చేయకుండా అన్ని వర్గాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి చేర్చుతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడంతోనే పాదయాత్రలకు దిగారని తెలిపారు. ఈ ప్రభుత్వంపై జనం పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయారన్నారు. ఎమ్మెల్యే వెంట నాయకులు సీవీ కుమార్, చాంద్బాషా, మండీసుధా, కమాల్, జాఫర్, కోదండరామయ్య, ప్రహ్లాద తదితరులున్నారు.