'జగన్ సీఎం కావాలని ప్రజలంతా ఎదురుచూస్తున్నారు'
నెల్లూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రజలంతా ఎదురు చూస్తున్నారని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. ఉదయగిరిలో ఆదివారం వైఎస్ఆర్సీపీ ఇంచార్జ్ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజక వర్గ ప్లీనరీ జరిగింది. ఇందులో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజీవయ్య, గూడూరు సమన్వయ కర్త ఎ మురళీధర్, జడ్జీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి, ఆనం విజయకుమార్రెడ్డి, వేణు గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తొలుత మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ హయాంలోనే ఉదయగిరి నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. వెనుకబడిన ప్రాతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలంటే వైఎస్ జగన్ అధికారంలోకి రావాల్సిందేనని అన్నారు. అనంతరం మేకపాటి రాజమోహన్రెడ్డి మాట్లాడుతూ రుణమాఫీ లాంటి అబద్ధపు హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ధ్వజమెత్తారు. కరువు, చంద్రబాబు కవల పిల్లలని, చంద్రబాబు అధికారంలోకి వస్తే ప్రజలు ఇబ్బందులు పడాల్సిందేనని దుయ్యబట్టారు. ప్రస్తుతం ప్రజలంతా వైఎస్ జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారని చెప్పారు.