రైల్లో వెళ్లాలంటేనే భయం వేస్తోంది!

రైల్లో వెళ్లాలంటేనే భయం వేస్తోంది! - Sakshi

గడిచిన మూడు నెలల్లో మూడు రైలు ప్రమాదాలు జరిగాయని, ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయని వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైలు ప్రమాద బాధితులకు ఏదో నామమాత్రంగా కాక.. కనీసం రూ. 20 లక్షల పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా కూనేరు వద్ద రైలు ప్రమాదం సంభవించిన సంఘటనా స్థలాన్ని ఆయన సోమవారం సాయంత్రం సందర్శించి, అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇది విద్రోహచర్య అయినా, రైల్వేశాఖ తప్పయినా.. అసలు తప్పు మాత్రం ప్రభుత్వానిదేనని, గమ్యం చేరుకోకుండానే ప్రయాణికులు మరణించడం దారుణమని ఆయన అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైల్వేశాఖ, ప్రభుత్వం మృతుల కుటుంబాలకు కనీసం రూ. 20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

 

రైలెక్కాలంటే ఒక నమ్మకం రావాలని.. ప్రభుత్వం, రైల్వేశాఖ నుంచి పరిహారం భారీగా వస్తేనే ప్రజలకు ఆ నమ్మకం కుదురుతుందని తెలిపారు. ఈ ఘటనపై విచారణ గట్టిగా జరగాలని, ఆ నివేదికలను బహిర్గతం చేసి రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో కూడా చెప్పాలని అన్నారు. రైల్వే శాఖలో భద్రతా చర్యలు మెరుగుపడాలని.. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని తెలిపారు. చనిపోయిన కుటుంబాలకు మనమంతా కూడా అండగా నిలబడాలని, అందుకు ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని అన్నారు. 

 

ఇప్పుడు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు ఇస్తున్న 25 వేలు, 50 వేలు ఏమాత్రం సరిపోవని ఆయన అన్నారు. ఆస్పత్రిలో చాలా పేదలు ఉన్నారని, వాళ్లు మూడు నాలుగు నెలల పాటు మళ్లీ పనుల్లోకి వెళ్లలేరని, ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం చికిత్సకు మాత్రమే సరిపోయేలా కాకుండా వాళ్లకు కూడా మానవతా దృక్పథంతో కనీసం 2 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఏదో విచారణ జరిపామని వెళ్లిపోతారు తప్ప ప్రజలను ఆదుకున్నట్లు ఎక్కడా కనిపించదని అన్నారు. పట్టాలు కూడా నిజంగా పాతవే అయితే వాటిని యుద్ధప్రాతిపదికన మార్చాలని ఆయన కోరారు.
 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top