పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలి
కడప అర్బన్ :
పోలీసుస్టేషన్లలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించాలని జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్గులాఠీ పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ నవీన్ గులాఠీ కేసులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దొంగతనాల కేసుల్లో వెంటనే రికవరీ చేయాలన్నారు.
హత్య కేసుల్లో ఏవైనా పరిష్కారం కాకపోతే డీఎస్పీ స్థాయి అధికారిని సంప్రదించి తగిన సలహాలు పొంది వెంటనే పరిష్కరించాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలైన మట్కా, గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్ లాంటి వాటిపై గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డుపై ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడుపుతుంటే వారికి బ్రీత్ఎనలేజర్ ద్వారా పరీక్షలు నిర్వహించి కేసులు నమోదు చేయాలన్నారు.
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కేసుల పెండింగ్పైన, నమోదుపైన సమీక్ష జరిపారు. ప్రతి సీఐని పెండింగ్ కేసులపైన, అసాంఘిక కార్యకలాపాలపై నమోదైన కేసుల విషయమై క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ పీవీజీ విజయ్కుమార్, జమ్మలమడుగు ఏఎస్పీ వెంకటప్పలనాయుడు, కడప, రాజంపేట, పులివెందుల డీఎస్పీలు రాజేశ్వరరెడ్డి, అరవిందబాబు, హరినాథబాబులతోపాటు సీఐలు పాల్గొన్నారు.