వైఎస్ఆర్సీపీపై ఎల్లో మీడియా అసత్య ప్రచారం
చిత్తూరు జిల్లా: నంద్యాల ఉప ఎన్నికలో సీఎం చంద్రబాబునాయుడు కుయుక్తులు పన్నుతున్నారంటూ వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలో ఓట్లు రాబట్టుకునేందుకే చంద్రబాబు అభివృద్ధి హామీలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. ఉప ఎన్నిక లేకపోతే నంద్యాల నియోజకవర్గంలో ఒక్క పని కూడా చంద్రబాబు చేసేవారు కాదని అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
పథకం ప్రకారమే నంద్యాలలో అవినీతి డబ్బు పంపిణీ జరుగుతోందని ఆయన విమర్శించారు. చంద్రబాబు హయాంలో రాయలసీమకు పూర్తిస్థాయిలో అన్యాయం జరుగుతోందన్నారు. రెయిన్ గన్స్తో పంటలను కాపాడామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వ ధనాన్ని పథకాల పేరుతో ఎలా దోచుకోవాలో తెలిసిన వ్యక్తి చంద్రబాబు అని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు కుట్రలను ప్రజలు గమనించాలని, ప్రత్యేక హోదాను గాలికొదిలేసిన వ్యక్తి ఆయన అని విమర్శించారు.
ఎల్లో మీడియాపై మండిపాటు
వైఎస్ఆర్సీపీపై కొన్ని న్యూస్ చానెళ్లు, వార్తాపత్రికలు ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేస్తున్నాయని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బొట్టుబిళ్లల పంపిణీపై ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. డబ్బులు పంచుతున్నారంటూ అసత్య ప్రచారం చేయడాన్ని తప్పుబట్టారు. జగన్ ఫొటోతో కూడిన బొట్టు బిళ్లల పంపిణీ మాత్రమే చేశామని తెలిపారు. ప్రలోభాలకు లొంగకపోవడం వల్లే టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందన్నారు. అసత్య ప్రచారం చేసిన మీడియా, ప్రతిక క్షమాపణ చెప్పాలని, లేదంటే ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్తామని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.