ఏపీ సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఆదివారం ఉదయం చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. ఏపీ రాజధాని వ్యవహారానికి సంబంధించి వివరాలను పవన్ కళ్యాణ్ తెలుసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా శనివారం ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కూడా చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ చర్చించే అవకాశం ఉంది.
గత కొన్ని రోజుల క్రితం రాజధాని భూములకు సంబంధించి రైతులు నిరసన వ్యక్తం చేయడంతో వారి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. రాజధాని భూములు విషయంలో చంద్రబాబును పవన్ ప్రశ్నించాలని రైతులు డిమాండ్ చేయడం తెలిసిందే. అయితే ఇటీవలే కేంద్రం తన హామీలను నెరవేర్చుకునే సమయం వచ్చిందంటూ పవన్ ట్విట్టర్ లో పేర్కొనడం కూడా చర్చనీయాంశంగా మారింది.