పవన్ కళ్యాణ్ది ప్రశ్నించే పార్టీనే కాదు
ప్రొద్దుటూరు : ప్రశ్నించే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చాలా ఆలస్యంగా ప్రశ్నించడానికి మీడియా ముందుకు వచ్చినా ఆయనకు ప్రశ్నలే కరువయ్యాయని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. ఆయన మంగళవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రధానంగా వెలుగు చూస్తున్న ఓటుకు నోటు వ్యవహారంపై పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నించలేకపోయారన్నారు. టీడీపీ నేత రేవంత్రెడ్డి పట్టుబడిన వైనం, చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన చెప్పలేకపోయారన్నారు. దీంతో చంద్రబాబును పవన్ సమర్థిస్తున్నాడని ప్రజలు చెప్పుకుంటున్నారన్నారు.
ఎదుటి వారి కళ్లల్లో దూలాలు చూడగల ఆయన ఓటుకు నోటు వ్యవహారాన్ని గమనించకపోవడాన్ని బట్టి చూస్తే ఏమైనా దృష్టిలోపం ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాంలో సీఎం కేసీఆర్ యాదాద్రి దేవాలయానికి ఆర్కిటెక్చర్ డిజైనర్గా విజయనగరం జిల్లాకు చెందిన ఆనంద్సాయిని నియమించడాన్ని అభినందించిన పవన్ కళ్యాణ్, అమరావతి రాజధాని నిర్మాణాన్ని చంద్రబాబు సింగపూర్ దేశస్తులకు అప్పగించడాన్ని ఎందుకు విమర్శించడం లేదన్నారు. రాష్ట్రంలో, దేశంలో ఎంతో మంది మేధావులు ఉన్నారని, వారితో రాజధాని నిర్మించుకోగలం అన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ప్రకటన కేవలం రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి చేసిందేనన్నారు.