త్వరలో చంద్రబాబు, పవన్ లు ఢిల్లీకి!
హైదరాబాద్:ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లు త్వరలో ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. శనివారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన కేంద్ర సాధారణ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరగడంపై బాబు, పవన్ లు ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమవుతారని సమాచారం. దీనిలో భాగంగానే చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ ఆదివారం సమావేశమయ్యారు. ఏపీ రాజధాని వ్యవహారానికి సంబంధించి వివరాలను పవన్ కళ్యాణ్ తెలుసుకోనున్నారు. కొన్ని రోజుల క్రితం రాజధాని భూములకు సంబంధించి రైతులు నిరసన వ్యక్తం చేయడంతో పవన్ కళ్యాణ్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో పాటు ఇటీవల కేంద్రం తన హామీలను నెరవేర్చుకునే సమయం వచ్చిందంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చే ప్రత్యేక హోదా అంశంపై బడ్జెట్ లో ప్రస్తావించకపోవడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ తో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని తెలిపారు.