భగ్గుమన్న పాత కక్షలు
కిష్ణగిరి, న్యూస్లైన్: ఫ్యాక్షన్ గ్రామమైన ఎరుకలిచెర్వులో మరోసారి పాత కక్షలు భగ్గుమన్నాయి. హత్య కేసులో రాజీకి రాలేదని వైఎస్సార్సీపీ కార్యకర్త కురవ నారాయణ(50)ను కాంగ్రెస్ పార్టీ నాయకులు దారుణంగా హత్య చేశారు. దీంతో గ్రామంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
కిష్ణగిరి మండలంలోని ఈ గ్రామంలో 2006 అక్టోబరు 23న కురవ రంగన్న, కురవ బాలగిడ్డి, కురవ బజారిలను తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. అప్పట్లో ఈ ముగ్గురి హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో ఏడేళ్లుగా గ్రామం నివురుగప్పిన నిప్పుల్లా ఉంది. నాటి నుంచి నేటి వరకు గ్రామంలో పోలీసు పికెట్ కొనసాగుతోంది. అయితే అప్పట్లో హత్యోదంతంలో మృతి చెందిన వారి సమీప బంధువైన చెరుకులపాడు కురవ నారాయణ ప్రస్తుతం వైఎస్సార్సీపీలో కొనసాగుతున్నారు. అలాగే నాటి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రస్తుతం కాంగ్రెస్లో చేరారు.
పథకం ప్రకారమే హత్య..
చెరుకులపాడు కురవ నారాయణ క్రిష్ణగిరి మోడల్ స్కూల్లో తాత్కాలిక వాచ్మెన్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. రెండు రోజుల కోసారి ఆయన స్వగ్రామమైన ఎరుకలి చెర్వుకు వెళ్లి వస్తూ విధులు నిర్వహిస్తూ ఉండేవాడు. పాఠశాలకు గత రెండు రోజుల క్రితం సెలవులు ఇచ్చారు. ఇదే అదనుగా చూసుకున్న ప్రత్యర్థులు పాఠశాలలో నుంచి కురవ నారాయణను కిడ్నాప్ చేసి తీవ్రంగా దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం.