‘భయం పుట్టిస్తున్న విజయవాడ నేరాలు’
విజయవాడ: టీడీపీ ప్రభుత్వం దివాళాకోరుతనంతో పనిచేస్తోందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి విమర్శించారు. నేరాలను చంద్రబాబు సర్కారు వ్యవస్థీకృతం చేస్తోందని ఆరోపించారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తన కుమారుడు నారా లోకేశ్ అసమర్థను కప్పిపుచ్చకునేందుకే సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు.
ముఖ్యనేత సూచన మేరకే టీడీపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తమది రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వమని చెప్పుకుంటున్న చంద్రబాబు.. అధికారులపై దాడులు చేసిన టీడీపీ నాయకులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. విజయవాడలో జరుగుతున్న దౌర్జన్యాలను ఎందుకు అరికట్టలేక పోతున్నారని సూటిగా అడిగారు. విజయవాడలో నేరాలు చూసి రాష్ట్రం భయపడుతోందన్నారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే..
-
ఏపీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా పనిచేస్తోందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కాట్జూ పేర్కొన్నారు. -
ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీలకు ఆయన లేఖ రాశారు. -
కాట్జూతో జగనే లేఖ రాయించారని టీడీపీ ఆరోపించనందుకు సంతోషిస్తున్నాం -
మొన్న ఢిల్లీ వెళ్లినప్పుడు లేఖ రాయమని కాట్జూను జగన్ కోరారని టీడీపీ నాయకులు అన్నాఅనొచ్చు -
అప్పుడప్పుడు తళుక్కుమని మెరిసే ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ ఎవరికీ తెలియని విషయం ఒకటి చెప్పారు -
తమది రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వమని ప్రకటించారు -
అనేక విషయాల్లో రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేసినప్పుడు ఆయన ఎందుకు నోరు విప్పలేదు -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడం రాజ్యాంగబద్ధమా? -
ఆ రోజు గుర్తుకు రాలేదేమో రాజ్యాంగ బద్దంగా పనిచేస్తుందని -
కాట్జూ కుటుంబ సభ్యుల ఫొటోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెడితే ఊరుకుంటారా అని పరకాల అడిగారు -
ఎన్నికలకు ముందు జగన్ కుటుంబ సభ్యుల ఫొటోలను మార్ఫింగ్ చేసి పోస్టు చేసినప్పుడు పరకాల ఎక్కడున్నారు? -
ఇవన్నీ బయట పెడితే సిగ్గుతో మీ కళ్లు చెవులు ముక్కు అన్ని మూసుకుపోతాయి -
తన కుమారుడి అసమర్థను కప్పిపుచ్చకునేందుకే సోషల్ మీడియా కార్యకర్తలపై సీఎం కేసులు పెట్టిస్తున్నారు -
సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించడం తగదు -
విజయవాడలో జరుగుతున్న దౌర్జన్యాలను ఎందుకు అరికట్డలేక పోతున్నారు? -
పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నది వాస్తవం కాదా? -
ఓ వ్యక్తి ని కిడ్నాప్ చేసి, చిత్రహింసలకు గురి చేస్తే.. టీడీపీ ముఖ్యనేతలే నిందితులకు కొమ్ముకాస్తున్నారు -
అధికారులపై దౌర్జన్యం చేసిన టీడీపీ నాయకులపై ఎటువంటి చర్యలు ఉండవు -
గదిలో కూర్చొబెట్టి సీఎం పంచాయతీ చేయడం రాజ్యాంగబద్ధమా -
అక్రమాలకు పాల్పడిన అధికార పార్టీ నేతలపై రాజ్యాంగబద్ధంగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? -
హవాలా కార్యకలాపాల్లోనూ టీడీపీ మంత్రుల హస్తముందన్న ఆరోపణలు వస్తున్నాయి -
ముఖ్యనేత సూచన మేరకే టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారు -
నేరాలను టీడీపీ ప్రభుత్వం వ్యవస్థీకృతం చేస్తోంది -
అక్రమార్కులను పుచ్చొంకాయలు ఏరిపారేసినట్టు ఏరేయకపోతే ప్రజలు ఇబ్బందులు పడతారు