టోల్‌గేట్‌పై పరిటాల శ్రీరాం దాడి!


అనంతపురం: అనంతపురం జిల్లా గుత్తి టోల్‌గేట్‌పై పౌరసరఫరాలశాఖ రాష్ట్రమంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరాంతో పాటు అతని అనుచరులు మంగళవారం రాత్రి దాడి చేసినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు... హైదరాబాద్ నుంచి అనంతపురానికి వస్తున్న శ్రీరాం కోసం కొందరు అనుచరులు డోన్‌కు వెళ్లారు. గుత్తి టోల్‌గేట్ వద్ద కేవలం పోయేందుకు మాత్రమే రుసుం చెల్లించారు. శ్రీరాంకు స్వాగతం చెప్పి తిరిగి వస్తుండగా టోల్‌గేట్ వద్ద సిబ్బంది వాహనాలు నిలిపారు. తిరుగు ప్రయాణానికి మళ్లీ రసీదు తీసుకోవాలని చెప్పారు. దీంతో శ్రీరాంతో పాటు అతని అనుచరులు అక్కడున్న వేదక్ అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరిపై దాడి చేసినట్లు తెలిసింది. కాగా ఈ వివరాలను అధికారికంగా చెప్పేందుకు టోల్‌గేట్ నిర్వాహకులు భయపడుతున్నారు.




సీసీ పుటేజీల స్వాధీనానికి మంత్రి హుకుం




విషయం తెలిసిన మంత్రి పరిటాల సునీత వెంటనే టోల్‌గేట్ వద్ద ఉన్న సీసీటీవీ పుటేజీలు స్వాధీనం చేసుకోవాలని వారి అనుచరులకు సూచించినట్లు తెలిసింది. ఘటన జరిగిన సమయానికి డీజీపీ రాముడు అనంతపురంలోనే ఉన్నారు. ఉదయం మంత్రి ఇంటికి కూడా వెళ్లారు. రాత్రి టోల్‌గేట్ వద్ద జరిగిన సంఘటనను మంత్రి డీజీపీకి వివరించి, కేసు లేకుండా టోల్‌గేట్ నిర్వాహకులతో చర్చిస్తామని, వీలుకాని పక్షంలో శ్రీరాంను కేసు తప్పించాలని డీజీపీకి మంత్రి సూచించినట్లు తెలిసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top