పంటసాగుకు పైసలేవీ?

పంటసాగుకు పైసలేవీ? - Sakshi


పలమనేరు: రుణమాఫీ మాట దేవుడెరుగు.. బ్యాంకులు రైతులకు కొత్త రుణాలను అస్సలివ్వడం లేదు. దీంతో పంట సాగుకోసం పెట్టుబడికి ఏం చేసేదిరా దేవుడా అంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ రైతు చేతిలో చిల్లిగవ్వలేక సగానికి పైగా భూములు పంటలకు నోచుకోకుండా బీళ్లుగానే దర్శనమిస్తున్నాయి. రుణమాఫీకి సంబంధించి బ్యాంకులకు ఇప్పటివరకు స్పష్టమైన ఆదేశాలు అందలేదు. ఈ ప్రక్రియ ఆలస్యమవుతుండడంతో కొత్త రుణాలు సైతం ఇప్పట్లో అందే సూచనలు కనిపించడం లేదు. మరోవైపు  ప్రైవేటు రుణాలు కూడా పుట్టడం లేదు. గత ఏడాది ఈ సమయానికి 95 శాతం మంది రైతులకు వేరుశెనగ పూర్తిగా సాగుచేశారు. ఇతర పంటల విస్తీర్ణం కూడా సరాసరి విస్తీర్ణానికి దగ్గరగా ఉండేది. కానీ ఈ దఫా ఆ పరిస్థితి కనిపించడం లేదు.

 

గత ఏడాది 10వేల మంది రైతులకు రూ.70 కోట్ల రుణాలు

 

పలమనేరు నియోజకవర్గంలోని 15 బ్యాంకులు గత ఏడాది 10వేల మంది రైతులకు రూ.70 కోట్లను రుణాలుగా అందించాయి. ఇందులో పంట రుణాలు 45 కోట్లు, బంగారం తనఖాపై రుణాలు 35 కోట్లు. ఈ రుణాల కారణంగా వ్యవసాయ పెట్టుబడులకు ఇబ్బంది లేకుండా పోయింది. ఫలితంగా నియోజకవర్గంలో వేరుశెనగతో పాటు ఇతర ముఖ్య పంటలైన చెరకు, వరి, కూరగాయ పంటల విస్తీర్ణం ఏ మాత్రం తగ్గలేదు.

 

ప్రస్తుత పరిస్థితి ఏమంటే..

 

ఈ ప్రాంతంలోని ఏ బ్యాంకు గానీ రైతులకు పంట రుణాల ను ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం చెప్పినట్లు ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే అది కూడా రూ.1.5 లక్షల వరకే రుణమాఫీ అని పేర్కొంది. దీంతో బ్యాంకర్లు సైతం ఆ మేరకు రుణాలు మాఫీ అయ్యే వారి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రుణమాఫీ పొందే రైతులు కేవలం 30 శాతం మంది మాత్ర మే. మిగిలిన 70 శాతం మంది రైతులకు ఆగస్టు మొదటి వారంలో నోటీసులు పంపేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఒకటిన్నర లక్షకంటే ఎక్కువగా రుణం తీసుకున్న రైతులు రీ షెడ్యూల్‌కు బ్యాంకులు చుట్టూ తిరుగుతున్నారు. కొత్త పంట రుణాలపై ఆశలు వదులుకున్నారు. బ్యాంకర్లను వీరు అప్పులడిగినా వారు ఇచ్చే పరిస్థితిలో లేరు.

 

ఈ ఖరీఫ్‌లో ఇబ్బందులే

 

చేసిన పంటలు చేతికి రాక తీసుకున్న అప్పులు కట్టలేక రైతన్నలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈసారి పంట సాగుకు పెట్టుబడి లేదు. కష్టమోనష్టమో వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతన్నల పరిస్థితి దుర్భరంగా తయారైంది. భూగర్భ జలాలు అడుగంటి సగానికి పైగా బోర్లు ఈ ప్రాంతంలో ఎండిపోయాయి. ఫలితంగా రైతులు అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ తరుణంలో ఎకరా పొలంలో వేరుశెనగ సాగు చేయడానికి రూ.30వేల దాకా పెట్టుబడి లేకే సగం మంది రైతులు ఈ దఫా వేరుశెనగ పొలాలను బీడుగానే వదిలేశారు. ఇక ఇతర పంటల పరిస్థితి అలాగే ఉంది. గత పదేళ్లలో సరాసరి పంటల సాగు విస్తీర్ణం ఇంత ఘోరంగా తగ్గిపోవడం ఎప్పుడూ లేదని వ్యవసాయశాఖాధికారులే చెబుతున్నారు.  

 

పుట్టని ప్రైవేటు రుణాలు.. గిట్టుబాటుగాని సేద్యం

 

పలమనేరు నియోజకవర్గంలో మొత్తం 3 లక్షల జనాభా, 60 వేల కుటుంబాలు ఉన్నాయి. ఇందులో 40 వేల మందివి రైతు కుటుంబాలే. వీరికి వ్యవసాయమే జీవనాధారం. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో రైతుల పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇక్కడ ఎక్కువగా పండించే వేరుశెనగ ఏటా రైతులను నిండా ముంచేస్తోంది. గత మూడేళ్లకు సంబంధించిన రూ.10 లక్షలకు పైగా ఇన్‌ఫుట్ సబ్సిడీ ఈ ప్రాంత రైతులకు ఇప్పటికీ అందలేదు.



ఇక టమోట రైతులకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోయారు. ఆరేళ్ల నుంచి రైతులకు ఈ కష్టాలు తప్పడం లేదు. చెరకు సాగు చేసిన రైతులకు గిట్టుబాటు ధర లేక, ఫ్యాక్టరీలకు తరలించినా చేతికేమీ మిగలడం లేదు. గానుగలాడినా గిట్టుబాటు కావడం లేదు. ఫలితంగా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. అప్పు చేయకపోతే సేద్యం చేయలేని పరిస్థితి ఈ ప్రాంతంలో నెలకొంది.  ప్రైవేటు రుణాలూ దక్కడం లేదు. నూటికి రూ.5 నుంచి పది రూపాయల వడ్డీ ఇస్తామన్నా రైతులను నమ్మి వడ్డీ వ్యాపారులు అప్పులివ్వడం లేదు.

 

 కొత్త రుణాలను ఇచ్చే పరిస్థితి కనిపించలే

 

ఈ దఫా బ్యాంకులు కొత్తగా క్రాప్ లోన్లు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వం నుంచి రుణమాఫీపై గైడ్‌లైన్స్ వచ్చినాకే కొత్త లోన్ల గురించి ఆలోచిస్తామని బ్యాంకర్లు చెబుతున్నారు. ఇప్పటికే పంటల సాగుకు డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నాం. ఈ సారీ భూమి బీడు పెట్టాల్సిందే.

 - రవీంద్రారెడ్డి, కూర్మాయి, పలమనేరు మండలం

 

 వడ్డీ వ్యాపారుల వద్దా అప్పు పుట్టడం లేదు

 

బ్యాంకులోకెళ్లి కొత్త లోన్లు అడుగుతుంటే ఇవ్వడం లేదు. వడ్డీ వ్యాపారుల దగ్గర నూటికి ఐదు రూపాయల వడ్డీ ఇస్తామన్నా వాళ్లు ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో మాలాంటి రైతులు పంట చేయాలంటే డబ్బు ఎక్కడ్నుంచి తెచ్చేది. ఏ పంట సాగు చేయాలన్నా ఎకరాకు 40 వేలు కావాల్సిందే.  

 -రవి, కేటిల్‌ఫామ్, పలమనేరు మండలం

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top