కల్పవృక్షంపై కల్పవల్లి

కల్పవృక్షంపై కల్పవల్లి - Sakshi


తిరుచానూరు : తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు శనివారం ఉదయం కల్పవల్లి అయిన శ్రీ పద్మావతి అమ్మవారు కోర్కెలను తీర్చే కల్పవృక్ష వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. అంతకుముందు అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొల్పి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 7 గంటలకు అమ్మవారిని ఆలయంలోని అద్దాలమండపం నుంచి వేంచేపుగా వాహనమండపానికి తీసుకొచ్చి కల్పవృక్ష వాహనంపై కొలువుదీర్చారు. పట్టుపీతాంబర స్వర్ణాభరణాలతో కుడి చేతిలో చర్ణాకోలు, ఎడమ చేతిలో రాజదండం, నడుములో వేణువు, బుర్రను ధరించి గోవులను పాలించే రాజగోపాలునిగా అలంకరించారు.



అనంతరం 8గంటలకు జీయర్ల దివ్య ప్రబంధ పారాయణం, మంగళ వాయిద్యం, చిన్నారుల కోలాటం, దాససాహితీ భజన బృందం, కళాకారుల నృత్య ప్రదర్శన, భక్తుల గోవింద నామస్మరణ నడుమ అమ్మవారు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు. రాత్రి అమ్మవారు హనుమంతుని వాహనంపై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. వాహనసేవలో టీటీడీ ఈవో ఎంజీ.గోపాల్, తిరుపతి జేఈవో పోలా భాస్కర్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఎస్‌ఈ రామచంద్రారెడ్డి, ఆలయ స్పెషల్‌గ్రేడ్ డెప్యూటీ ఈవో చెంచులక్ష్మి, ఏఈవో నాగరత్న పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top