పచ్చధనం స్వాహా!

పచ్చధనం స్వాహా! - Sakshi


సాక్షి ప్రతినిధి, అనంతపురం :

 పక్క ఫొటోలోని ట్రాక్టర్‌లో కనిపిస్తోన్న కలప గుత్తి చెరువులోనిది. ఏళ్లతరబడి ఏపుగా పెరిగిన భారీ తుమ్మ వృక్షాలు చెరువు నిండా విస్తరించి ఉన్నాయి. వీటిపై టీడీపీ నేతల కన్ను పడింది. ఇంకేముంది? అడ్డూ అదుపు లేకుండా 15 రోజులుగా వృక్షాలను నరికి విక్రయించేస్తున్నారు. చివరకు అడ్డొచ్చిన అధికారులపై స్థానిక ప్రజాప్రతినిధి చిందులేశాడు. దీంతో అధికారులు కూడా నిశ్చేష్టులయ్యారు.

 

గుత్తి శివారు ప్రాంతంతో పాటు కొజ్జేపల్లి, లచ్చానుపల్లి గ్రామాల పరిధిలో సర్వే నెంబరు 486లో 877.57 ఎకరాల విస్తీర్ణంలో గుత్తి చెరువు విస్తరించి ఉంది. 30-50 ఏళ్ల వయస్సున్న తుమ్మ చెట్లు చెరువు అంతటా ఉన్నాయి. ప్రస్తుతం చెరువును హంద్రీ-నీవా నీటితో నింపేందుకు అధికారులు యత్నిస్తున్నారు. దీనికి చెరువులోని తుమ్మ చెట్లు అడ్డొస్తాయని భావించారు. ఈ క్రమంలో ఉపాధి హామీ పథకం ద్వారా తొలగించేందుకు చిన్ననీటి పారుదల శాఖ అధికారులు డ్వామాకు సిఫార్సు చేశారు. కంపచెట్లు తొలగింపు మాత్రమే ఉపాధి హామీ ద్వారా చేపట్టొచ్చని, చెట్లను నరికేసేందుకు కుదరదని డ్వామా అధికారులు తిరస్కరించారు.



 నిబంధనలు ఇవీ!

 చెరువులోని చెట్లను నరికేసేందుకు మొదట అటవీ శాఖ అనుమతి తప్పనిసరి. ఆపై పంచాయతీ,  కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ శాఖ అనుమతి తీసుకోవాలి. తర్వాత టెండర్ పిలవాలి. టెండర్ దక్కించుకున్న వారు చెట్లను నరికి విక్రయించుకోవచ్చు. తద్వారా వచ్చిన ఆదాయంలో 50 శాతం గ్రామ పంచాయతికి ముట్టజెప్పాలి. తక్కిన 50 శాతం ‘పర్యావరణ పరిరక్షణ’ కింద చెరువు గట్టు, చెరువు పరిసర ప్రాంతాల్లో మొక్కలు పెంచేందుకు ఖర్చు చేయాలి.



 15 రోజులుగా ఇలా జరుగుతోంది..

 చె రువులోని వృక్ష సంపదపై టీడీపీకి చెందిన నియోజకవర్గ స్థాయి నేత కన్ను పడింది. ఎలాంటి అనుమతి లేకుండా తన అనుచరులతో వారం రోజులుగా చెట్ల నరికివేతకు ఉపక్రమించాడు. ఇదేంటని ప్రశ్నించిన కొందరు అధికారులపై రుబాబు చేశారు. ‘ఏం.. నీకేంటి పని.. నేను కలెక్టర్‌తో అనుమతి తీసుకున్నా.. నీకు చెప్పాల్సిన పనిలేదు.. దీంట్లో వేలు పెట్టొద్దు జాగ్రత్త..’ అంటూ హెచ్చరించారు. దీంతో అధికారులు కూడా అధికార పార్టీ ప్రజాప్రతినిధి వ్యవహారంతో మనకెందుకులే అన్నట్లు.. చూసీ చూడనట్లు వ్యవహరించారు.



ఈ క్రమంలో రోజుకు 40 మంది కూలీల చొప్పున ఇప్పటి వరకు 30 ఎకరాల్లో చెట్లను నరికించారు. ట్రాక్టర్లలో తరలించి బహిరంగ మార్కెట్లో విక్రయించారు. వచ్చిన సొమ్మును జేబులో వేసుకున్నారు. వారం రోజులుగా ఈ తంతు జరుగుతున్నా అధికార పార్టీ ప్రజాప్రతినిధి కావడంతో అధికారులు నిర్లిప్తంగా వ్యవహరించారు. ఈ క్రమంలో కొజ్జేపల్లి సర్పంచ్ మహేశ్వరప్ప నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.



ఇదే సమయంలో ఫారెస్ట్ అధికారులు కూడా నీటి పారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. చివరకు శనివారం నీటి పారుదల శాఖ జేఈ షబ్నమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ సంఘటనపై వివరాలు తెలుసుకునేందుకు ‘సాక్షి’ సంబంధిత అధికారులను సంప్రదిస్తే.. శుక్రవారం వరకూ చెట్లు నరికేస్తున్నారనే సంగతే తమకు తెలీదని చెప్పడం గమనార్హం.

 

 పోలీసులకు ఫిర్యాదు చేశాం


 కొజ్జేపల్లి సర్పంచ్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాం. పోలీసులు చెరువులోకి వచ్చి కూలీలను అదుపులోకి తీసుకున్నారు. సంఘటనపై పూర్తి విచారణ చేపడతామన్నారు. ఇప్పటి వరకూ నరికేసిన చెట్లను వేలం వేయాలని నిర్ణయించుకున్నాం. కలెక్టర్ అనుమతి రాగానే ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం.     - షబ్నమ్, జేఈ, చిన్న నీటి పారుదల శాఖ.

 

 మా అనుమతి తీసుకోలేదు

 చెరువులో చెట్లను నరికేసేందుకు మా అనుమతి తీసుకోలేదు. దీనిపై నీటి పారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాం. చెట్లు మా పరిధిలోకి రావు. నీటి పారుదల శాఖ పరిధిలోకి వస్తాయి. కానీ అనుమతి మాత్రం అటవీ శాఖ నుంచి కూడా తీసుకోవాలి.          - డేవిడ్, ఫారెస్ట్ ఆఫీసర్, గుత్తి రేంజ్.

 

 కలెక్టర్ అనుమతి ఉందని చెబుతున్నారు

 జేఈ షబ్నమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూలీలను అదుపులోకి తీసుకుని విచారించాం. కూలీలు కొందరి పేర్లు చెప్పారు. చెట్లను నరికేందుకు కలెక్టర్ అనుమతి కూడా ఉందన్నారు. ఇదే విషయాన్ని జేఈ షబ్నమ్‌కు చెప్పాం. అనుమతి పత్రాన్ని తీసుకురావాలని సూచించాం. ఎవరూ చెరువులోకి వెళ్లకుండా చర్యలు తీసుకున్నాం.          -రమణారెడ్డి, ఎస్‌ఐ, గుత్తి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top