అవయవ దానంపై అవగాహన
ప్రొద్దుటూరు కల్చరల్:
అవయవదానంపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి వారిలో చైతన్యం కలిగించాలని జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ సుదర్శనరెడ్డి అన్నారు. స్థానిక గీతాశ్రమంలో మంగళవారం రోటరీక్లబ్ ఆధ్వర్యంలో అవయవదానంపై జరిగిన అవగాహనా సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు జేసీ మాట్లాడుతూ ఇటీవలి కాలంలో కిడ్నీ మార్పిడి ఎక్కువగా జరుగుతోందన్నారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండెను వేరొకరికి అమర్చి బతికించిన వైద్యుల ఘనతను కొనియాడారు.
వ్యక్తి చనిపోతున్నప్పుడు అవయవాలు మట్టిపాలు కాకుండా దానం చేయడం వలన కొంత మంది ప్రాణం పోయవచ్చన్నారు. ప్రజలలో నేత్రదానంపై అవగాహనతో ఎక్కువగా కళ్లుదానం చేస్తున్నారన్నారు. అవయవదానం ద్వారా మరణానంతరం కూడా జీవించడం గొప్పవిషయమన్నారు. వైద్యవిధాన పరిషత్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.ఎన్.మూర్తి మాట్లాడుతూ అవయవదానం చేయడం ద్వారా కిడ్నీ, కళ్లు, లివర్, గుండె వంటి వాటిని తీసుకుని వేరొకరికి అమర్చడం ద్వారా వారిని బతికించవచ్చన్నారు.
వల్లూరు ఎంపీడీఓ మొగిలిచెండు సురేష్ మాట్లాడుతూ రక్తదానంపై ప్రజలలో చైతన్యం వచ్చిందని అలాగే అవయవదానంపై కూడా రావాలన్నారు. రోటరీడిస్ట్రిక్ గవర్నర్ మన్సూర్ మాట్లాడుతూ భారతదేశంలో పోలియో మహమ్మారిని పారదోలేందుకు రోటరీ వారు విశేష కృషి చేశారన్నారు.
అవయవగ్రహీత, కొవ్వూరు రమేష్రెడ్డి చారిటబుల్ట్రస్ట్ అధ్యక్షులు కొవ్వూరు రమేష్రెడ్డి ప్రొద్దుటూరు నుంచి తిరుమలకు 230 కిలోమీటర్లు పాదయాత్రచేసిన సందర్భంగా ఆయనకు శాలువకప్పి, పూలమాలలు వేసి సన్మానించారు. అలాగే రోటరీ క్లబ్ ఒకేషనల్ మంత్ ప్రోగ్రామ్ ద్వారా ఫైర్, మున్సిపాలిటీ, ఆర్టీసీ, 108 విభాగాలలో విస్తృత సేవలు అందించిన వారిని సాధు గోపాలకృష్ణ సత్కరించారు.
ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ రాజారామ్మోహన్రెడ్డి, కార్యదర్శి రామకృష్ణ, రోటరీ క్లబ్ కడప అసిస్టెంట్ గవర్నర్ మహబూబ్పీరా, ప్రభుకుమార్, ఇన్నర్వీల్ క్లబ్ అధ్యక్షురాలు ఉషారాణి, జాకీర్ అహ్మద్, బాలసూర్యారావు తదితరులు పాల్గొన్నారు.