హ్యాపీ ‘ఆన్‌లైన్’ షాపీ


 పండగ సీజన్ వచ్చిందంటే దుస్తులు, ఇతర వస్తువులు కొనడానికి ఆపసోపాలు పడాల్సి వస్తుంది. షాపింగ్‌కి వెళ్లి, దుకాణాలన్నీ కాళ్లరిగేలా తిరగాలి. నచ్చిన వస్తువులు, దుస్తులను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత కొనుక్కుని తిరిగి రావాలి. గ్రామీణులైతే షాపింగ్ కోసం  దూరాభారమైనా, ఖర్చులు భరించి సమీపంలోని పట్టణాలకు వెళ్లాలి. ఈ కష్టాలన్నింటికీ ఇప్పుడు చక్కని పరిష్కారం దొరికింది. అదే ఆన్‌లైన్ షాపింగ్.. ముంగిట్లో వ్యాపార ప్రపంచం దర్శనం.

 

 పిఠాపురం :ఆన్‌లైన్ షాపింగ్‌పై ఇప్పుడు గ్రామీణులూ ఆసక్తి చూపిస్తున్నారు. ఇళ్లల్లోనే కంప్యూటర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంటర్‌నెట్ కనెక్షన్ పొంది ఒక్క క్లిక్‌తో ప్రపంచంలోని ఏ వస్తువునైనా కొనేస్తున్నారు. గుండు సూది నుంచి గృహాల వరకు ఒకేచోట ప్రత్యక్షం కావడంతో  కోరిన వస్తువును ఇంటికి తెచ్చుకుంటున్నారు. డబ్బు, శ్రమను ఆదాచేసుకుంటున్నారు. ఒకప్పుడు ఈ విధానం పట్టణాలకే పరిమితమయ్యేది. ఇప్పుడు గ్రామాల్లోనూ సెల్‌ఫోన్, కంప్యూటర్ల వినియోగదారులు పెరిగారు. సెల్‌ఫోన్లలోనూ ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో యువత ఎంచక్కా ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారు.  అలాగే పాత వస్తువులు అమ్ముకోవాలన్నా ఆన్‌లైన్‌పైనే ఆధారపడుతున్నారు.

 

 ఆన్‌లైన్ షాపింగ్ వల్ల ప్రయోజనాలు

 ఆన్‌లైన్ షాపింగ్ వల్ల సమయం కలిసి వస్తుంది. దుకాణాల వెంట తిరగనక్కరలేదు. ప్రయాణ ఖర్చులు, అవస్థలూ తప్పుతాయి. ఇంటి వద్దే ఉండి కంప్యూటర్‌లోనో, సెలఫోన్‌లోనో నెట్ ఆన్‌చేసి వెబ్‌సైట్‌లలోని వస్తువులను చూసుకోవచ్చు. ఇంటిల్లిపాదీ చూసి నచ్చిన వస్తువును ఎంపిక చేసుకోవచ్చు. ఎక్కువ శాతం కంపెనీలు ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. దీనివల్ల బహిరంగ మార్కెట్లో కంటే ఆన్‌లైన్‌లో వస్తువులు చౌకగా లభిస్తున్నాయి. క్రెడిట్, లేదా డెబిట్ కార్డులు ఉపయోగించి వస్తువులను కొనుక్కోవచ్చు. త్వరగా ఇంటికి వస్తాయి కూడా. కొన్ని కంపెనీలు ఉచిత డెలీవరి సౌకర్యం కూడా కల్పిస్తున్నాయి. మరి కొన్ని కంపెనీలు వస్తువులో లోపాలు తలెత్తితే మార్చుకునే వెసులుబాటునూ కల్పిస్తున్నాయి. స్నాప్‌డీల్, ప్లిప్‌కార్ట్, అమోజన్ వంటి ప్రముఖ కంపెనీలు ఆన్‌లైన్ వ్యాపారంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి.

 

 అనర్థాలు లేకపోలేదు

 ఆన్‌లైన్ షాపింగ్‌పై అవగాహన ముఖ్యం. వాటి గురించి తెలి యకుండా షాపింగ్ చేస్తే డబ్బు వృథాగా పోతోంది. నాసిరక వస్తువులు ఇంటికి వస్తాయి.  మోసానికి గురయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి

 

 ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది

 ముందుగా నమ్మకమైన సైట్‌ను ఎంచుకోవాలి.

 చిన్న వస్తువులు, తక్కువ ధర ఉండే వాటిని కొనడం ప్రారంభించాలి.  

 అలవాటై ఆ కంపెనీపై నమ్మకం వచ్చే వరకు అప్రమత్తత అవసరం.

 కొనే వస్తువు పూర్తి వివరాలు చూసుకుని బయటి మార్కెట్‌లో ధరతో పోల్చి చూడాలి.

 వారంటీ, గ్యారంటీ వివరాల విషయంలో

 

 జాగ్రత్త పాటించాలి.

  వస్తువు కొనే ముందు ఒకటికి రెండుసార్లు కంపెనీ గురించి తెలుసు కోవాలి.

  మరమ్మతులకు గురైతే ఆ కంపెనీలు ఏయే చర్యలు తీసుకుంటాయో ముందుగా తెలుసుకోవాలి.   

  కొన్న వస్తువులు కొన్నిరోజుల తర్వాత రిపేరైతే ఆ కంపెనీల షాపులు దగ్గరలో ఉన్నాయో లేదో చూసుకోవాలి.

  మోసం జరుగుతున్నట్టు గుర్తిస్తే పోలీసులను సంప్రదించాలి.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top