నందిగాంలో ‘ఉల్లి’ రాజకీయాలు!


నందిగాం: నందిగాంలో గురువారం సాయంత్రం ఉల్లి రాజకీయాలు నడిచాయి. ఇందిరా క్రాంతిపథం ద్వారా ఉల్లిపాయల పంపిణీ జరిగింది. గ్రామాల్లో ఎలాంటి ప్రచారం లేకుండా పంపిణీ చేపట్టారు. టీడీపీ మండలాధ్యక్షుడు పినకాన అజయ్‌కుమార్, మరో నాయకుడు మళ్ల బాలకృష్ణ చేతులమీదుగా ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఉల్లి పంపిణీ వార్త సాయంత్రం 4గంటలకు తెలియగానే పరిసర గ్రామాల నుంచి ఒక్కసారిగా పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు. కిక్కిరిసిన జనాలు రావడంతో రేషన్ కార్డుకు 2 కిలోలు అందించారు. కానీ రూ. 20లకు అమ్మకం చేపట్టాల్సిపోయి కిలో రూ. 30ల చొప్పున విక్రయించినట్లు స్థానికులు విలేకర్లకు ఫిర్యాదు చేశారు.

 

 ఇదేమని ప్రశ్నించిన వారికి ఏపీఎం జాంబవతి ‘మా ఇష్టం.. మాకు నచ్చిన విధంగా పంపిణీ చేస్తాం’ అని చెప్పడంతో కొంతమంది ఆశ్చర్యపోయారు. మరికొంతమంది గ్రామైక్య సంఘ అధ్యక్షులతో గ్రామాలకు తరలించి, నచ్చిన విధంగా అమ్మకాలు చేపట్టాలని ఆమె ఆదేశించినట్లు స్థానికులు తెలిపారు. మండలానికి ఎన్ని కిలోలు మంజూరయ్యాయని విలేకరులు ప్రశ్నించగా అకస్మాత్తుగా పంపించారు.. వివరాలు చెప్పలేమని ఏపీఎం సమాదానం చెప్పారు.

 

 రహస్య ప్రాంతంలో ఉల్లి నిల్వలు

 నందిగాం మండలానికి మంజూరైన ఉల్లి బస్తాలను మరికొన్ని టీడీపీ నాయకుల ఇళ్లలో నిల్వ ఉంచినట్లు తెలుస్తోంది. వాటిని వారు ఇష్టారాజ్యంగా కార్యకర్తలకు అమ్మకాలు చేసుకోవాలని ఏపీఎం స్వయంగా వారికి తెలిపినట్లు సమాచారం. పెంటూరు, వేణుగోపాలపురం, సుభద్రాపురం, నందిగాం బీసీ కాలనీల్లో కొన్ని బస్తాలను నిల్వ చేసినట్లు కొందరు స్థానికులు ఆరోపిస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top