38 ప్రాణాలు కాపాడిన ఫోన్ కాల్!
అర్ధరాత్రి దాటాక కుటుంబ సభ్యులతో ఓ యువతి సాగించిన ఫోన్ సంభాషణే బస్సులోని 38 మంది ప్రాణాలను కాపాడింది. బుధవారం వేకువజామున ఉలవపాడు మండలం చాగల్లు వద్ద జాతీయ రహదారిపై పర్వీన్ ట్రావెల్స్కు చెందిన హైటెక్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. వారి సామగ్రి, నగలు, డబ్బు, ల్యాప్టాప్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ బస్సులో చివరి వరుస సీటులో కూర్చున్న శ్వేతా నటరాజన్ అనే యువతి నిద్రపోతున్న సమయంలో ఫోన్ రావడంతో మెలుకువ వచ్చింది.
వెనుక నుంచి పొగరావడం గమనించి వెంటనే బస్సు ఆపి ప్రయాణికులను లేపడంతో అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. వారు దిగిపోయిన కొద్ది నిముషాల్లోనే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఆమె నిద్రపోయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. బస్సు డ్రైవర్ పొగలు గమనించినా నిర్లక్ష్యంగా 20 కిలోమీటర్లు ముందుకు నడపడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెనుక నుంచి మంటలు వ్యాపించడంతో డిక్కీల్లో ఉన్న సూట్కేసులు, బ్యాగులు తీసే అవకాశం లేకుండా పోయింది.
దీంతో అందరి సామగ్రి పూర్తిగా కాలిపోయింది. హైదరాబాద్కు చెందిన నూతన దంపతులు నికేష్ హేమాద్రి, క ల్యాణికి చెందిన రూ.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ల్యాప్టాప్, నగదు అగ్నికి ఆహుతయ్యాయి. చెన్నైకి చెందిన నలుగురు విద్యార్థులు హైదరాబాద్కు శిక్షణ కోసం వెళ్తున్నారు. వీరి సర్టిఫికెట్లు కాలి బూడిదయ్యాయి. నెల్లూరు జిల్లా అల్లూరుకు చెందిన వినోద్తో పాటు మరికొందరి ల్యాప్టాప్లు కాలిపోయాయి.
కళ్లముందే బంగారం బూడిదపాలు కావడంతో క ల్యాణి కన్నీరు మున్నీరుగా విలపించింది. కేవలం పది నిమిషాల్లోనే బస్సు పూర్తిగా దగ్ధమైందని ప్రయాణికులు తెలిపారు. బస్సులో వెనుక వైపు 10 బాక్స్లు ఉన్నాయని, మధ్యలో అవి కింద పడడంతో తాము పైన పెట్టినట్లు చివరి సీటు ప్రయాణికులు తెలిపారు. అవి స్వీట్బాక్సులని డ్రైవర్ తెలిపాడు. ప్రమాదం ఎలా జరిగిందో తెలియాలంటే విచారణ పూర్తయితేనే చెప్పగలమని పోలీసులు అంటున్నారు.
భారీగా నష్టం
బస్సు ప్రమాదంలో భారీగా నష్టం వాటిల్లింది. సుమారు రూ.60 లక్షల విలువైన బస్సు పూర్తిగా దెబ్బతింది. ప్రయాణికుల నగదు, వస్తువులు, బంగారం కాలిపోయాయి. సుమారు రూ.20 లక్షల విలువైన వస్తువులు కాలిబూడిదయ్యాయని ప్రయాణికులు వాపోయారు. ఫోరెన్సిక్ ఏడీ రామకృష్ణ, క్లూస్టీం సీఐ రాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై విచారణాధికారిగా నెల్లూరు రవాణా శాఖాధికారి శివరాంప్రసాద్ను నియమించారు.
ప్రయాణికుల రాస్తారోకో..
పోలీసులు, అధికారులు సక్రమంగా స్పందించలేదని ప్రయాణికులు రాస్తారోకో నిర్వహించారు. సుమారు 20 నిమిషాల పాటు ఒంగోలు వైపు వెళ్లే వాహనాలను నిలిపివేశారు. కందుకూరు సీఐ లక్ష్మణ్ వచ్చి వారికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
పలువురి అండ..
బస్సు ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అటువైపుగా వెళుతున్న మానవ హక్కుల సంఘం నేత అవినాష్ దేవీచంద్రలు ప్రయాణికులకు సహకరించారు. తిరుపతి వెళుతున్న అవినాష్ అక్కడే ఉండి ప్రయాణికులకు మద్దతుగా రాస్తారోకో నిర్వహించారు. వెంటనే పోలీసులు మిగిలిన ప్రయాణికులను వివిధ మార్గాల్లో పంపించారు.
మంత్రుల పరిశీలన..
బస్సు దుర్ఘటన జరిగిన స్థలాన్ని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖా మంత్రి శిద్దా రాఘవరావు, పౌరసంబంధాలు, ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిలు పరిశీలించారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం అన్నారు. కలెక్టర్ విజయ్కుమార్, ఎస్పీ శ్రీకాంత్లు ఘటనా స్థలంలో పరిస్థితిని సమీక్షించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి వెంట పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే బీఎన్ విజయ్కుమార్ ఉన్నారు.
ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూటేమో..
- డ్రైవర్ తంగివేలు
షార్టు సర్క్యూట్ వలనే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని బస్సు డ్రైవర్ తంగివేలు అభిప్రాయపడ్డాడు. బస్సులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవన్నాడు. కావలి సమీపంలో కొద్దిగా కాలిన వాసన రావడంలో ఆపి బస్సును పరిశీలించగా బయట మొత్తం బాగానే ఉండటంతో తిరిగి ప్రయాణం ప్రారంభించినట్లు తెలిపాడు. అంతా బాగానే ఉన్న లోపలి నుంచి మంటలు వచ్చాయంటే షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటుందని అన్నాడు.
బంగారం బూడిదైపోయింది
నెలక్రితం పెళ్లయింది. మానాన్న వాళ్లు చేయించిన బంగారం అంతా బ్యాగ్లో పెట్టా. అది మొత్తం కాలి బూడిదైపోయింది. అత్తగారింటికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మంటలు ఆర్పిన వెంటనే వెళ్లి వెతికినా ఉపయోగం లేదు. కొన్ని ఆభరణాలు కనపడడంతో వాటిని తీసుకున్నా. నాకు న్యాయం చేయండి.
- కెంగు కల్యాణి, ప్రయాణికురాలు
సర్టిఫికెట్లు కాలిపోయాయి
చెన్నై అమృత ఇన్స్టిట్యూట్లో చదువుతున్నాం. ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వెళుతున్నాం. మొత్తం నలుగురు బయలుదేరాం. ఈ ప్రమాదంలో మా సర్టిఫికెట్లు, పదివేల రూపాయల నగదు మొత్తం కాలిపోయాయి. ఏం చేయాలో అర్థం కావడంలేదు. మా కాలేజీ యాజమాన్యం వాళ్లు వెనక్కి రమ్మన్నారు. వెళ్లడానికి కూడా డబ్బులు లేవు.
- శబరీష్, కిరణ్