ఫేస్బుక్ ద్వారా సమస్యల పరిష్కారంపై దృష్టి
చిత్తూరు(ఎడ్యుకేషన్): ఫేస్బుక్లో ఉన్న జిల్లా కలెక్టర్ చిత్తూరు పేజీలో యూజర్స్ నుంచి వచ్చే సూచనలపై కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ దృష్టిపెట్టారు. ఆయన సెప్టెంబర్ 8వ తేదీన ప్రైమరీ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎలా పెంచాలో సూచనలు ఇవ్వండి అంటూ పేజీలో చేసిన పోస్టుకు యూజర్స్ బాగా స్పందించారు. పోస్టును 165 లైక్చేయగా, 221 మంది కామెంట్స్ను పొందుపరిచారు.
ప్రభుత్వ వేతనం పొందే ప్రతి ఉద్యోగ, ఉపాధ్యాయులు వారి పిల్లలను ప్రభుత్వ బడిలోనే చదివించాలి, ప్రతి కిలో మీటరుకు ఒక పాఠశాల కాకుండా పంచాయితీకి ఒక పాఠశాల ఉండాలి, అప్పుడే పరిస్థితి ఏంటని సులువుగా తెలుసుకోవచ్చు, ఉపాధ్యాయుల పనితీరుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి, ప్రైవేటు పాఠశాలలను తగ్గించాలి అంటూ అభిప్రాయాలు వ్యక్తపరిచారు.
ఇలా వచ్చిన కామెంట్స్ను నోట్ చేసుకోవాలని కలెక్టర్ జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశించారు. వాటిని నిశితంగా పరిశీలించాలని, ఏవైనా సూచనలను ఆచరణలో పెట్టేందుకు సాధ్యమవుతోందో లేదో ? చూడాలన్నారు.