4న కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయుల ధర్నా


విజయవంతానికి యూటీఎఫ్ పిలుపు

శ్రీకాకుళం :  జిల్లా పరిషత్ పీఎఫ్ సమస్యలు, రిమ్స్ కార్యాలయంలో మెడికల్ రీయింబర్స్‌మెంట్ సమస్యల పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) ఆధ్వర్యంలో జూన్ 4న  కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రెడ్డి మోహనరావు, చౌదరి రవీంద్ర, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు సంపతిరావు కిశోర్‌కుమార్ తెలిపారు. ధర్నాకు సంబంధించి యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం కరపత్రాన్ని విడుదల చేశారు.



ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా పరిషత్ పీఎఫ్ ఆన్‌లైన్ ప్రక్రియ సుదీర్ఘ కాలంగా నడుస్తుందని, సంవత్సరాల తరబడి ఉపాధ్యాయుల పీఎఫ్ ఖాతాల వివరాలు లేకపోవడంతో తీవ్ర గందరగోళంగా వుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ పీఎఫ్ సబ్‌స్క్రిప్షన్ సక్రమంగా జమ అవుతున్నదీ, లేనిదీ తెలియడం లేదన్నారు. 2012-13 సంవత్సరానికి సంబంధించి వివరాలు అప్‌డేట్ చేయడానికి ఇన్నేళ్లా? అని ప్రశ్నించారు. జెడ్పీ సీఈవో మీనమేషాలు లెక్కిస్తూ ఏవో కథలు చెబుతున్నారని, కానీ సమస్య పరిష్కారం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కో-ఆర్డినేటర్ సమావేశాలు నిర్వహించి హామీలు ఇస్తున్నారు కానీ మళ్లీ యథాతథ స్థితి వుందని పేర్కొన్నారు. అలాగే మెడి కల్ రీయింబర్స్‌మెంట్ సమస్యల విషయంలో రిమ్స్ అధికారులు, సిబ్బంది ఇష్టానుసారంగా బిల్లులు మంజూరు చేస్తున్నారని ఆరోపించారు.

 

బిల్లుల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోందని, బిల్లుల్లో కోత సహేతుకంగా లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారమై రిమ్స్ కార్యాలయం వద్ద యూటీఎఫ్‌ఏ పోరాటం చేస్తే దాన్ని భగ్నం చేయాలని రిమ్స్ యంత్రాంగం విఫలయత్నం చేసిందన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంభిస్తుందన్నారు. ధర్నా కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు హాజరై విజయవంతం చేయాల ని వారు కోరారు. కార్యక్రమంలో శ్రీకాకుళం రూరల్ నాయకులు సనపల తిరుపతిరావు, బమ్మిడి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top