తుంగభద్ర దిగువ కాల్వలో వృద్ధుడి గల్లంతు


గోనెగండ్ల (కర్నూలు జిల్లా) : కర్నూలు జిల్లా గోనెగండ్ల సమీపంలోని గాజులదిన్నె ప్రాజెక్టు వద్ద గల తుంగభద్ర దిగువ కాల్వలో ఒక వృద్ధుడు గల్లంతయ్యాడు. ఈ మేరకు గోనెగండ్ల పోలీస్ స్టేషన్‌లో మంగళవారం కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ముస్తాపురం గ్రామానికి చెందిన కృష్ణయ్య(60) అనే వృద్ధుడు గోనెగండ్లలో స్థిరపడ్డాడు. టీవీఎస్ మోపెడ్‌పై టార్పాలిన్ పట్టాలు వేసుకుని పల్లె పల్లె తిరుగుతూ అమ్మి జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు గాజులదిన్నె ప్రాజెక్టు వైపు వెళుతూ దాహం వేయడంతో సమీపంలోని తుంగభద్ర దిగువ కాలువలో దిగి నీళ్లు తాగబోయి ప్రమాదవశాత్తూ కాలువలో పడి గల్లంతైనట్లు అనుమానిస్తున్నారు.



మంగళవారం ఉదయం వరకూ కృష్ణయ్య ఇంటికి రాకపోవడంతో సాటి వ్యాపారి భాస్కర్‌కు అనుమానం వచ్చి వెతగ్గా తుంగభద్ర దిగువ కాలువ పక్కన టీవీఎస్ వాహనం, చెప్పులు ఉండడం గమనించి నీళ్ల కోసం కాలువలోకి దిగి గల్లంతై ఉంటాడని భావించాడు. ఈమేరకు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇంతవరకూ కృష్ణయ్య ఆచూకీ దొరకలేదు. కాలువ వెంబడి గాలింపు కొనసాగుతుందని పోలీసులు చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top