'షూట్ ఆన్ సైట్ ఆర్డర్స్ కావాలి'
ఆయుధాలతో సంచరిస్తూ ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న స్మగ్లర్లను అడ్డుకోవాలంటే పోలీసులకు కాల్పులు జరిపే అధికారం ఉండాలని టాస్క్ ఫోర్స్ డీఐజీ కాంతారావు అన్నారు. సిబ్బంది కొరతతో సతమతమవుతున్న తమకు ప్రభుత్వం షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇస్తే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చిని పేర్కొన్నారు.
బుధవారం చిత్తూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఎర్ర చందనం అక్రమ రవాణాను అడ్డుకోవడంలో ప్రభుత్వ సహకారం లభించడంలేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం 75 మంది పోలీసులు, 16 మంది అటవీశాఖ సిబ్బందితో టాస్క్ఫోర్సు బృందం పనిచేస్తోందని, దీనిని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
అసోం రాష్ట్రంలో స్మగ్లర్లు పోలీసులపై తిరగబడితే కాల్చేసే అధికారం ఉందని, దీనిపై ఎలాంటి కేసు కూడా ఉండదన్నారు. ఆ తరహా అనుమతి కోసం ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాసి, స్పందన కోసం నిరీక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాయలసీమతో పాటు మొత్తం ఆరు జిల్లాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత టాస్క్ఫోర్సుపై ఉందని, మొత్తం 463 పోస్టులు మంజూరయితే ఇప్పటి వరకు 91 మందినే కేటాయించారని వివరించారు.