ఎన్టీఆర్ ఆశయాలకు తిలోదకాలు

ఎన్టీఆర్ ఆశయాలకు   తిలోదకాలు - Sakshi


పార్టీ ఫిరాయింపులను చట్టం రాకముందే వ్యతిరేకించిన మహానేత రామారావు

నైతిక విలువలతో కూడిన రాజకీయాలను భావితరాలకు అందించాలి

ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి




బాపట్ల:  ఎన్టీఆర్ ఆశయాలను తుంగలో తొక్కేవిధంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పాలన కొనసాగిస్తోందని ఎమ్మెల్సీ డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. పార్టీ ఫిరాయింపుల చట్టం రాకముందే ఆ విధానాన్ని వ్యతిరేకించిన ఎన్‌టీ రామారావు నెలకొల్పిన పార్టీ అధికారంలో ఉండగానే ఫిరాయింపులను ప్రోత్సాహించడం బాధాకరమన్నారు. శనివారం తన నివాసంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏటా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నిర్వహించే మహానాడు సందర్భంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా పాలన కొనసాగుతుందా? పార్టీ నడుస్తోందా లేక అందుకు భిన్నంగా నడుస్తోంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించి తీర్మానం చేయాల్సి ఉందన్నారు.



1982లో ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పుడు నాదెండ్ల భాస్కరరావు, నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి, అశోక్‌గజపతిరాజు, గద్దె రత్తయ్య, నారాయణ, ఆదెయ్యలు పార్టీలోకి వస్తామంటే అప్పట్లో ఎన్టీఆర్ పార్టీ పదవులతోపాటు వాటి ద్వారా వచ్చిన పదవులకు రాజీనామా చేస్తే టీడీపీలో చేరాలని సూచించారని ఉమ్మారెడ్డి గుర్తు చేశారు. వెంటనే నాదెండ్ల భాస్కరరావు, నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి, అశోక్‌గజపతిరాజు ఒప్పుకోగా మిగిలిన వారు ఒప్పుకోకపోవడంతో పార్టీలోకి తీసుకోలేదన్నారు. ఇప్పటికైనా టీడీపీలోకి పార్టీ ఫిరాయింపులతో వచ్చిన వారిపై చర్యలు తీసుకునే విధంగా మహానాడులో చర్చించాలని సూచించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top