ఎవరి (మీ) కోసం


సాక్షి, విశాఖపట్నం : పేరు మారింది.. కానీ తీరు మాత్రం మారలేదు. ప్రతీ నెలా మండల కార్యాలయాల నుంచి జిల్లా కార్యాలయాల వరకు చెప్పులరిగేలా తిరగడమే తప్ప సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. గ్రీవెన్స్.. ప్రజాదర్భార్.. ప్రజావాణి.. తాజాగా మీకోసం ఇలా పేర్లు మారుతున్నాయే తప్ప ప్రజల వెతలు మాత్రం తీరడం లేదు. ఎక్కేగుమ్మం.. దిగే గుమ్మం అన్నట్టుగా తయారైంది అర్జీదారుల పరిస్థితి. రాష్ర్ట వ్యాప్తంగా గతేడాది డిసెంబర్ నుంచి ప్రజావాణి స్థానంలో ‘మీకోసం’ ప్రవేశపెట్టారు. ఈ పథకానికి మన జిల్లాలో శ్రీకారం చుట్టి మూడు నెలలు కావస్తోంది.



ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సమస్యల పరిష్కారంలో సాంకేతిక విప్లవం తీసుకొస్తున్నట్టుగా గొప్పలు చెప్పుకున్నారు. ఇందుకోసం మండల స్థాయి నుంచి రాష్ర్ట స్థాయి వరకు ఎవరైనా ఎప్పుడైనా ఏ ఆర్జీ ఏ స్థితిలో ఉందో తెలుసుకునేందుకు వీలుగా ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా రూపొందించారు. జిల్లాలో 32 డిపార్టుమెంట్ల పరిధిలో అందే అర్జీలను ఈ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తూ వాటిలో ఎన్ని పరిష్కారమయ్యాయి. ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. వాటి స్థితిగతులను కూడా తెలియజేస్తున్నారు.



 నమోదు తీరు ఇలా...

 అర్జీదారుడు ఇచ్చిన అర్జీని కంప్యూటర్‌లో నమోదు చేస్తారు. దాన్ని సంబంధిత అధికారికి పంపిస్తారు. అర్జీదారునికి రసీదు ఇస్తారు. ఎప్పటికప్పుడు ఆ అర్జీ పురోగతిపై అర్జీదారుని ఫోన్‌కు ఎస్‌ఎంఎస్ రూపంలో సమాచారం ఇస్తారు.  టోల్‌ఫ్రీ నెం.1100/1800-425-4440 కు ఎవరైనా ఎప్పుడైనా కాల్ చేసి తమ అర్జీ పరిస్థితి తెలుసుకోవచ్చు. అయితే ఈ టోల్ ఫ్రీ నంబర్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లైన్ కలవడం లేదని అర్జీదారులు చెబుతున్నారు. ఒక వేళ కలిసినా మీ సమస్య ఫలానా అధికారి వద్ద పెండింగ్‌లో ఉందనే సమాధానం తప్ప పరిష్కారమైందనే సమాధానం రావడం లేదని వాపోతున్నారు. సెల్‌ఫోన్‌కు ఎస్‌ఎంఎస్ రావడం తప్ప పరిష్కా రానికి  నోచుకోవడం లేదని అంటున్నారు.



 కేవలం 31 అర్జీలకే పరిష్కారం

 జూన్ నుంచి ఆగస్టు నెలాఖరు వరకు మీ కోసం ద్వారా 1,266 అర్జీలందాయి. వాటిలో ఇప్పటి వరకు కేవలం 31 అర్జీలు మాత్రమే పరిష్కారానికి నోచుకున్నాయి. ఇంకా 1,235 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. కలెక్టరేట్‌లో అందే అర్జీల్లో అత్యధికం రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖలకు చెందినవే. ఆ తర్వాత పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి, విద్య శాఖల పరిధిలో ఉంటున్నాయి. పరిష్కారానికి నోచుకోని మీకోసం అర్జీలపై జిల్లా అధికారులను వివరణ కోరితే మెజార్టీ అర్జీలు పరిష్కార దశలో ఉన్నాయన్నారు. ఏ నెలలో అందిన అర్జీలపై ఆ నెలలో కలెక్టర్ సమీక్షిస్తున్నారని, ఎక్కువగా క్షేత్రస్థాయిలో పెండింగ్‌లో ఉండిపోతున్నాయని పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top