ముంపుబాధితుల జీవనపోరు

సోమశిల వెనుక జలాలు - Sakshi

డీకేటీ భూములకు ఇవ్వని పరిహారం

- ఆందోళనలో ఎస్సీ, బీసీ రైతులు

- ముంపుభూముల సాగుకు అటవీశాఖ అడ్డగింపు

- అప్పట్లో సోమశిల బాధితుల కన్నీళ్లు తుడిచిన వైఎస్సార్‌!

- నేడు ముంపుబాధితుల కోసం వైఎస్సార్‌సీపీ ర్యాలీ

-కలెక్టర్‌ను కలవనున్న నేతలు, ముంపు బాధితులు  

 

రాజంపేట:  వర్షాకాలం వచ్చిందంటే ముంపు బాధితులకు కష్టాలు మొదలైనట్లే. జలాశయం నిండితే గ్రామమంతా ఖాళీ చేసి వెళ్లాల్సిన పరిస్థితి. వేసిన పంటలు వదిలేయాల్సిందే. అలాగని ఇంకో జీవనోపాధి ఉందా అంటే అదీ లేదు. సరైన పరిహారం ఇంతవరకు అందలేదు. కొన్నిగ్రామాల్లో భూములకు పరిహారం ఇచ్చి ఇళ్లకు ఇవ్వని  పరిస్థితి. ఉద్యోగాలు లేవు. ముంపు కుటుంబా లన్నీ సాగుపైనే ఆధారపడి జీవించాలి. దీనికితోడు అటవీ అధికారుల ఆంక్షలు. దీంతో జిల్లాలోని ముంపుబాధితులు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జీవన పోరుకు సిద్ధమయ్యారు. వివరాల్లోకి వెళితే.. సోమశిల జలాశయానికి సంబంధించి వెనుకజలాలు జిల్లాలోని నందలూరు, ఒంటిమిట్ట, గోపవరం, అట్లూరు మండలాల్లో అనేక గ్రామాలు మునకకు గురయ్యేవి. అయితే పరి హారం ఇవ్వని కారణంగా వరద వచ్చినప్పుడు ఊర్లకు ఊర్లు వదిలి వెళ్లిపోవడం మళ్లీ నీళ్లు తగ్గిన తర్వాత గ్రా మాల్లోకి చేరుకోవడం లాంటివి సంఘటలతో ముంపుబాధితులు 1977 నుంచి అల్లాడిపోతూ వచ్చారు. 

 

మనోవేదనలో బాధితులు

సోమశిల ప్రాజెక్టు కింద మునకకు గురయ్యే ప్రాంతాల్లోని వేలాది ఎకరాల భూముల్లో సాగు చేయనీయకుండా ఇప్పుడు అటవీ అధికారులు అడ్డుకుంటున్నారనే మనోవేదన ముంపుబాధితుల్లో ఎక్కువగా ఉంది. చాలా గ్రామాల్లో హైలెవల్‌ కాంటూరు పేరుతో గ్రామంలోని కట్టడాలకు పరిహారం ఇవ్వకుండా, కేవలం భూములకు పరిహారం ఇచ్చేసి అప్పుడు చేతులు దులుపుకొన్నారు. అలాంటి వాటిలో నందలూరు మండలంలోని పొత్తపి ఉంది. ఇటీవల ఆ జాబితాలో ఒంటిమిట్ట మండలంలోని పెన్నపేరూరు గ్రామం చేరింది. ఇక్కడ భూముల సాగును అటవీ అధికారులు అడ్డగించడంతో రైతులు పూర్తిస్థాయిలో వ్యతిరేకతను వ్యక్తపరిచారు. ఇలాంటి ముంపు గ్రామాలు చాలా ఉన్నాయి. 1997 జీఓను అటవీశాఖ అడ్డంపెట్టుకొని ముంపు గ్రామాల పరిధిలో భూములును సాగు చేసుకోనివ్వకుండా అడ్డుపడుతున్నారు. 

 

బాధితుల కన్నీళ్లు తుడిచిన వైఎస్సార్‌

నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం కింద భూములు, ఇళ్లు కోల్పోయిన బాధితుల కన్నీళ్లు తుడిచింది వైఎస్‌ రాజశేఖరరెడ్డే. 2004 ముందు టీడీపీ పాలనలో నామమాత్రంగా ముంపుబాధితుల పరిహారం అందింది. వైఎస్సార్‌ సీఎల్‌పీ లీడరుగా ఉన్న సమయంలోనే సోమశిల ముంపు గ్రామాల్లో పర్యటించారు. ముంపుబాధితుల ఇబ్బందులు, బాధలు తెలుసుకొన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ఎలాగైనా పరిహారం ఇచ్చి ముంపుబాధితుల కన్నీళ్లు తుడవాలనుకున్నారు. వైఎస్సార్‌ సీఎం అయిన తర్వాత అప్పటి రాజంపేట ఎమ్మెల్యే కొండూరు ప్రభావతమ్మ బాధితుల పక్షాన ఆయనను కలిసి చర్చించారు. వారు సానుకూల నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈరోజు 80శాతం మేర పరిహారాన్ని ముంపువాసులు దక్కించుకున్నారు. అప్పటి డీసీసీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ముంపుబాధితులకు పరిహారం చెల్లింపు కోసం కృషిచేశారు.

 

నేడు ముంపుబాధితుల కోసం ర్యాలీ..

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం సోమశిల ముంపుబాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ కడప శివార్ల నుంచి ర్యాలీని చేపట్టనున్నారు. ఈ ర్యాలీలో ముంపుబాధితులతోపాటు వివిధ రైతుసంఘాలు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొననున్నారు. ముంపుబాధితులకు సకాలంలో పరిహారం ఇవ్వడం, భూములలో రైతులు చేసే సాగుకు అడ్డుతగలకుండా చర్యలు తీసుకోవాలని ప్రధానంగా వైఎస్సార్‌సీపీ కోరనుంది.

 

రూ.500కోట్ల పైచిలుకు పరిహారం

ఒంటిమిట్ట, నందలూరు, అట్లూరు, గోపవరం తదితర మండలాల్లోని భవనాలకు, భూములకు సింగల్‌ సెటిల్‌మెంట్‌ కింద ముంపుపరిహారం చెల్లించేందుకు అప్పటి వైఎస్సార్‌ ప్రభుత్వం అడుగులు వేసింది. ఆ దిశగా పరిహారం కోసం ప్రత్యేక జీఓలను కూడా తీసుకొచ్చింది. సోమశిల ముంపు గ్రామాలకు రూ.500కోట్ల పైగా నష్టపరిహారం చెల్లింపును చేపట్టడంతో ముంపు బాధితులు కన్నీళ్లు తుడిచిన వ్యక్తిగా వైఎస్సార్‌ బాధితుల హృదయాల్లో నిలిచిపోయారు. 105 గ్రామాల్లోని 120 చిన్నచిన్నపల్లెలోని కట్టడాలకు, భూములకు పరిహారం చెల్లించారు. ఇందువల్ల సోమశిల జలాశయంలో 71 టీఎంసీ నీటినిల్వను ఉంచుకోగలిగారు. 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top