‘ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ఆర్సీపీకి ఏంకాదు’
విశాఖ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య విలువలను చంద్రబాబు కాలరాస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్షాన్ని బలహీనపరిచి లబ్ధి పొందాలని చూస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ఆర్ సీపీకి ఏం కాదని, కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన ఇబ్బందేమీ లేదన్నారు. తాము ప్రజల వెంటే ఉంటామని, ప్రజల తరఫున పోరాడతామని అంబటి రాంబాబు అన్నారు.
కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టాకే వైఎస్ జగన్పై రాజకీయ ప్రేరేపిత కేసులు పెట్టారని అంబటి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికినా చంద్రబాబుపై కేసులు లేవని అన్నారు. మనవాళ్లు బ్రీఫ్డ్ మీ అన్న వాయిస్ చంద్రబాబుదేనని రుజువు కూడా అయిందన్నారు. చంద్రబాబు వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని, పోలీసులను ఉపయోగించి ప్రొద్దుటూరు చైర్మన్ ఎన్నికను వాయిదా వేయించారని ఆయన విమర్శించారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికను ప్రభుత్వం నిర్వహించలేదా అని ప్రశ్నించారు. చేతికి ఉంగరం, మెడలో చైన్ లేదని చెప్పే చంద్రబాబు...మరి వందలకోట్లతో రహస్యంగా ఇల్లు ఎలా నిర్మించారని అంబటి సూటిగా ప్రశ్నించారు.