బడ్జెట్లో ఏపీకి అన్యాయం, రేపు కాంగ్రెస్ ధర్నా


హైదరాబాద్: కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్పై కాంగ్రెస్ మాజీ మంత్రులు సి. రామచంద్రయ్య, బొత్స సత్యనారాయణలు మండిపడ్డారు. శనివారం వారు మీడియాతో మాట్లాడారు. ఈ బడ్జెట్లో కార్పొరేట్ వర్గాలకు తప్ప.. సామాన్యులకు మేలు జరగలేదని సి. రామచంద్రయ్య ధ్వజమెత్తారు. క్రూడాయిల్ ధర పడిపోకుండా ఉంటే ద్రవ్యోల్బణం తగ్గేదా? అని మండిపడ్డారు. పొరుగుదేశాలతో మైత్రి అన్న ప్రధాని నరేంద్ర మోదీ, ఇప్పుడు రక్షణ రంగానికి ఎందుకు భారీగా నిధులు కేటాయించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మిత్రపక్షాలను కూడా కేంద్ర బడ్జెట్ సంతోష పెట్టలేకపోయిందని రామచంద్రయ్య విమర్శించారు. బడ్జెట్పై టీడీపీ రెండుగా చీలిపోయిందని అన్నారు. ఆ పార్టీలో ఓ వర్గం బడ్జెట్ను తీవ్రంగా వ్యతిరేకిస్తుందని రామచంద్రయ్య తెలిపారు.



అలాగే కాంగ్రెస్ నేత బొత్స సత్యనారాయణ కూడా కేంద్ర బడ్జెట్పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాలను నిరాళపరిచిందన్నారు. పోలవరానికి రూ.100 కోట్లే కేటాయించడం దురదృష్టకరమని చెప్పారు. పోలవరాన్ని ఆలస్యం చేస్తే.. చంద్రబాబు చరిత్ర హీనులవుతారని దుయ్యబట్టారు. పట్టీసీమ ప్రాజెక్ట్ ఆలోచన వల్లే పోలవరం ఆలస్యమవుతుందని ఆయన విమర్శించారు. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయానికి నిరసనగా రేపు అన్నిజల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ ధర్నాలు చేపడుతామని బొత్స సత్యనారాయణ తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top