పోలవరం పరిహారంపై ఎన్ఎంసీ పర్యవేక్షణ
సమస్య పరిష్కరించాలని ఏపీ,
కేంద్ర జలవనరుల శాఖకు సూచన
న్యూఢిల్లీ: చట్ట ప్రకారం పెరిగిన మేర పరిహారం ఇవ్వాలని పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్వాసితులు కోరుతున్నందున ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర జలవనరులశాఖ సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని భూసేకరణ చట్టంపై పనిచేస్తున్న జాతీయ పర్యవేక్షణ కమిటీ(ఎన్ఎంసీ) ఆదేశించింది. గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని భూవనరుల విభాగం కార్యదర్శి వందనా కుమారి జెనా నేతృత్వంలోని ఈ కమిటీ ఇటీవల ఢిల్లీలో సమావేశమైంది.
ఈ సమావేశంలో పోలవరం పరిహారంపై సుదీర్ఘంగా చర్చించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్వాసితులకు కొత్త చట్టం ప్రకారం పరిహారం చెల్లించకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిని బలవంతంగా ఖాళీ చేయిస్తోందని, వారికి న్యాయం చేయాలని కోరుతూ సోషల్ అండ్ హ్యూమన్ రైట్స్ ఫోరం అధ్యక్షుడు డాక్టర్ పెంటపాటి పుల్లారావు చేసిన ఫిర్యాదుమేరకు జాతీయ పర్యవేక్షణ కమిటీ(ఎన్ఎంసీ) ఈ సమావేశంలో చర్చించింది. అయితే ఈ సమావేశానికి కేంద్ర జల వనరుల శాఖ ప్రతినిధి హాజరు కాలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున హాజరైన ప్రతినిధి తన నివేదికలో మొత్తం భూసేకరణ పూర్తయిందని, పరిహారం చెల్లించామని తెలిపారు. దీనిపై కేంద్ర భూవనరుల విభాగం కార్యదర్శి జెనా స్పందిస్తూ... అనేక ప్రశ్నలు లేవనెత్తారు.