కొత్త డీటీసీ బసిరెడ్డి


సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం:రవాణాశాఖ జిల్లా ఉపకమిషనర్ (డీటీసీ) ఎస్.వెంకటేశ్వరరావుకు బదిలీ అయింది. ఆయన స్థానంలో చిత్తూరు డీటీసీ ఎం.బసిరెడ్డిని నియమించారు. ఈ మేరకు జీవో నెంబరు 734ను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పది మంది డీటీసీలను బదిలీ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందులో భాగంగా ప్రస్తుతం పని చేస్తున్న వెంకటేశ్వరరావును విజయవాడ డీటీసీగా బదిలీ చేశారు. ఈయన శ్రీకాకుళం జిల్లాకు మార్చి 2013లో ఏలూరు నుంచి డీటీసీగా వచ్చారు. 1993లో ఆర్టీవోగా ఎంపికైన ఆయన పలు ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు విశేష కృషి చేశారు. ఇతర ప్రభుత్వ విభాగాలను కలుపుకుపోతూ లెసైన్స్‌లు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిర్వహణలో లక్ష్యసాధన కోసం కృషి చేశారు. కాగా అనంతపురం జిల్లాకు చెందిన ఎం.బసిరెడ్డి తొలుత ఆర్టీవోగానే ఎంపికై ఐదేళ్ల క్రితం డీటీసీగా పదోన్నతిపై చిత్తూరు వెళ్లారు. ప్రస్తుతం బసిరెడ్డిని శ్రీకాకుళం డీటీసీగా ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే వెంకటేశ్వరరావు మాత్రం తనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు అందలేదని స్పష్టం చేశారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top