'ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 9 అబద్ధాల ప్రచారం'
అనంతపురం: చంద్రబాబు నాయుడులా అబద్దాలు చెప్పలేదు, మోసం చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా నేతలతో ఆయన గురువారం నియోజవర్గాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా వైఎస్ జగన్ ...ధర్మవరం, పెనుకొండ నియోజకవర్గాల నేతలతో భేటీ అయ్యారు. గత ఎన్నికల్లో 1.30 లక్షల మంది వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే టీడీపీ కూటమికి 1.35 లక్షల మంది ఓటేశారన్నారు. గెలుపుకు 5 లక్షల ఓట్లు మాత్రమే తేడా ఉందన్నారు.
ఒక్క కడప ఉప ఎన్నికల్లోనే వైఎస్ఆర్సీపీకి 5.30 లక్షల మెజార్టీ వచ్చిందని వైఎస్ జగన్ అన్నారు. గత ఎన్నికల్లో ఓటమికి నరేంద్ర మోడీ హవా...రుణమాఫీ హామీ ప్రధాన కారణాలుగా చెప్పుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అధికారం కోసం చంద్రబాబు ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చారని, ఇప్పుడు ఆ హామీల అమలు నుంచి తప్పించుకోవాలనుకోవటం సమంజసమా అని ప్రశ్నించారు.
చంద్రబాబుకు తోడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 9 ఎన్నికల సందర్భంగా అబద్ధాలు ప్రచారం చేశాయని వైఎస్ జగన్ అన్నారు. ప్రస్తుతం ఏ ఎన్నికలు లేవు కదా అని బాబు అడ్డగోలు పాలన చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. మనకు ఉన్నది...చంద్రబాబుకు లేనిది విశ్వసనీయతే అని వైఎస్ జగన్ అన్నారు. పార్టీ బలోపేతం కోసమే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామని, గత ఎన్నికల్లో తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేశామని, వాటిని ఎలా సరిదిద్దుకోవాలో చర్చించుకోవాల్సిన అవసరం ఉందని వైఎస్ జగన్ అన్నారు.