నేడో రేపో బ్లాక్లిస్ట్
ఓబులవారిపల్లె: బెరైటీస్ ముడి ఖనిజాన్ని బ్లాక్ మార్కెట్లో విక్రయించిన పల్వరైజింగ్ మిల్లులకు ఖనిజ సరఫరా నిలిపివేసి వాటిని బ్లాక్ లిస్టులో పెట్టేందుకు ఏపీఎండీసీ యాజమాన్యం రంగం సిద్ధం చేసింది. ఈమేరకు పల్వరైజింగ్ మిల్లుల బ్లాక్లిస్టు ఒకటి, రెండు రోజుల్లో వెల్లడికానున్నట్లు తెలుస్తోంది. పల్వరైజింగ్ మిల్లుల పేరిట ఏపీఎండీసీ వద్ద కొనుగోలు చేసిన బెరైటీస్ ముడి ఖనిజాన్ని కొందరు మిల్లుల యజమానులు నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్లో విక్రయించారు.
చాలా కాలంగా జరుగుతున్న ఈ వ్యవహారంపై ఏపీఎండీసీ దృష్టి పెట్టింది. దీనిపై మేనేజర్స్థాయి అధికారులతో ఆగస్టు 1, 2వ తేదీల్లో విచారణ జరిపించారు. 171 మిల్లుల్లో విచారణ చేపట్టి రికార్డులు, ఫౌడర్ అమ్మకాలు, విద్యుత్చార్జీలు, ఇన్వాయిస్ బిల్లులతో పాటు ఇతర వాటిపై లోతుగా పరిశీలించి నివేదికలను ఏపిఎండీసీ ఎండీకి సమర్పించారు. నివేదిక మేరకు చర్యలు తీసుకునేందుకు ఎండీ శాలినీమిశ్రా రంగం సిద్ధం చేశారు. దాదాపు 30 పల్వరైజింగ్ మిల్లులను బ్లాక్లిస్టులో చేర్చినట్లు సమాచారం. వీటిలో కడప నగరంలో ఉన్న మిల్లులే అధికంగా ఉన్నాయి. మంగంపేట పరిసర ప్రాంతాలలో మరికొన్ని ఉన్నట్లు సమాచారం.