మచిలీపట్నంలో జాతీయ మెరైన్ అకాడమీ


* వైజాగ్, కర్నూలు, కృష్ణా జిల్లాల్లో ఆక్టోపస్ హబ్స్

* రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో ఏపీఎస్పీ బెటాలియన్లు

* స్థల సేకరణకు ‘రెవెన్యూ’తో సంప్రదింపులు

* విస్తృత సమీక్ష నిర్వహించిన డీజీపీ రాముడు


 

సాక్షి, హైదరాబాద్: తీరప్రాంత భద్రతకు కీలక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర పోలీసు విభాగం ఆ విభాగంలో సిబ్బందికి అత్యాధునిక శిక్షణ ఇచ్చేందుకు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జాతీయ మెరైన్ అకాడమీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందుబాటులో ఉన్న రూ.9.6 కోట్లను వినియోగించి ప్రస్తుతం ఉన్న మెరైన్ పోలీసుస్టేషన్లకు అదనంగా మరికొన్ని నిర్మించడంతోపాటు జెట్టీల కొనుగోలుకు చర్యలు వేగవంతం చేస్తున్నారు. వీటికి అవసరమైన స్థలం గుర్తింపు, సమీకరణ తదితర అంశాలకు కీలక ప్రాధాన్యం ఇస్తూ వీలైనంత త్వరలో పూర్తి చేయాలని భావిస్తోంది. కొత్త రాష్ట్రంలో పోలీసు విభాగం పునర్ నిర్మాణానికి సంబంధించి మంగళవారం డీజీపీ జాస్తి వెంకట రాముడు ఉన్నతాధికారులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.



ఇందులో అధికారులు అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్రం అందించాల్సిన నిధులపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో చర్చించేందుకు త్వరలో ఓ బృందం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ్ళ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఎనిమిది ఏపీఎస్పీ బెటాలియన్లకు తోడు మరో ఆరింటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాజధానిగా మారుతున్న విజయవాడతో పాటు పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, అనంతపురం, ప్రకాశం సహా మరో జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్‌లో ఉన్న స్పెషల్ ఆర్డ్మ్ రిజర్వ్ సెంట్రల్ పోలీసు లైన్స్ (ఎస్‌ఏఆర్ సీపీఎల్) విభజనకు కసరత్తు ప్రారంభించనున్నారు. ్ళ ఒడిశాలో ఉన్న విపత్తు నిర్వహణ బృందాల (ఓడీఆర్‌ఏఎఫ్) మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌లోనూ ఏర్పాటు చేయనున్న స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్‌ఎఫ్)కు ఆధునిక పరికరాలు అందించాలని నిర్ణయించారు. దీనికోసం జాతీయ స్థాయిలో ఉన్న ఎన్డీఆర్‌ఎఫ్‌తో పాటు ఓడీఆర్‌ఏఎఫ్ వినియోగిస్తున్న వాటిని పరిశీలించనున్నారు.



విశాఖ, కర్నూలు, కృష్ణా జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న ఆక్టోపస్, గ్రేహౌండ్స్ హబ్స్‌తో పాటు ఏపీఎస్పీ బెటాలియన్లు, మెరైన్ అకాడమీ తదితరాలు అవసరమైన భూముల గుర్తింపు, సేకరణ కోసం రెవెన్యూ విభాగంతో జిల్లాల వారీగా సంప్రదింపులు జరుపనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అన్ని వసతుల్నీ గ్రేహౌండ్స్, ఆక్టోపస్‌లకు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ్ళ సీఐడీ దర్యాప్తులో ఉన్న చిట్‌ఫండ్ సంబంధిత నేరాల దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు బాధితులకు ఊరట లభించేలా నిందితుల ఆస్తుల గుర్తింపు, స్వాధీనం తక్షణం చేపట్టాలని డీజీపీ ఆదేశించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top