22న ఒకే వేదికపై మోడీ, చంద్రబాబు, పవన్!
హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ప్రాంతంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సుడిగాలి పర్యటన చేయనున్నారు. తెలంగాణలో ఏప్రిల్ 22 తేదిన నిర్వహించే బహిరంగ సభల్లో మోడీ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ ఒకే వేదికను పంచుకోనున్నట్టు పీటీఐ తెలిపింది. ఏప్రిల్ 22న కరీంనగర్, నిజమాబాద్, మహబూబ్ నగర్, సికింద్రాబాద్ లో నిర్వహించే సభల్లో మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొనున్నారు.
మహబూబ్ నగర్ లో కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, నిజమాబాద్ లో కేసీఆర్ కూతురు కవిత ఎన్నికల బరిలో ఉన్నారు. సీమాంధ్రలో విశాఖపట్నం, విజయవాడ, అనంతపురంలో మే 2 తేదిన బహిరంగ సభలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలో ఏప్రిల్ 30 తేదిన, సీమాంధ్రలో మే 7 తేదిన ఎన్నికల జరుగనున్నాయి. ఇదిలా ఉండగా మల్కాజిగిరిలో పోటి చేస్తున్న లోకసత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణకు పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపారు.