చినబాబా.. మజాకా

చినబాబా.. మజాకా - Sakshi


    సీఎం కుమారునితో వెళుతున్న ఇండస్ట్రీస్ డెరైక్టర్ కార్తికేయమిశ్రా, సీఎం ఓఎస్‌డీ అభీష్ట

     అధికారుల పర్యటన ఖర్చు భారం పరిశ్రమలశాఖ, ఐటీ శాఖలపై..

     ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలన శాఖ


 

హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్‌ఈ నెల 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరుపుతున్న అమెరికా పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు అధికారులు కూడా వెళుతున్నారు. ముఖ్యమంత్రి కుమారుని అమెరికా పర్యటన పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమం. ఆయన ప్రభుత్వంలో ఎటువంటి పదవిలోనూ లేరు. అయినప్పటికీ ఆయనతోపాటు ఇద్దరు అధికారులను పంపించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతి మంజూరు చేశారు.





ఆ మేరకు పరిశ్రమల శాఖ డెరైక్టర్‌గా పనిచేస్తున్న కార్తికేయ మిశ్రా, అలాగే సీఎం కార్యాలయంలో ఓఎస్‌డీగా పనిచేస్తున్న అభీష్ట కూడా లోకేష్‌తో కలసి అమెరికా వెళుతున్నారు. కార్తికేయ మిశ్రా అమెరికా పర్యటన వ్యయాన్ని పరిశ్రమలశాఖ, అభీష్ట పర్యటన వ్యయాన్ని ఐటీ శాఖ భరించనున్నాయి. సీఎం ఆదేశాల మేరకు పరిశ్రమల శాఖ కమిషనర్ కార్తికేయ మిశ్రా, ముఖ్యమంత్రి ఓఎస్‌డీ అభీష్టల అమెరికా పర్యటనకు అనుమతిస్తూ సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.





గతంలో ఎప్పుడూ లేదు..

గతంలో ఏ సీఎం అయినా విదేశీ పర్యటనకు వెళితే ఆయన వెంట కుటుంబ సభ్యులు వెళ్లడమనేది జరిగేది. అయితే ముఖ్యమంత్రి వెళ్లకుండా ఆయన కుమారుడు వెళ్లే ప్రైవేట్ పర్యటనకు అధికారులను పంపించడం గతంలో ఎప్పుడూ జరగలేదని అధికార వర్గాలు పేర్కొంటుండడం గమనార్హం. ఇదిలా ఉండగా లోకేష్ ఇప్పటికే ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ప్రారంభించారు. తనకు అవసరమైన పనులకు సంబంధించిన ఫైళ్లను నడిపించడానికి సచివాలయంలో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను నియమించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top