అండగా నిలబడేందుకే దీక్ష: వైఎస్ జగన్
తణుకు : చంద్రబాబు నాయుడు మోసపూరిత వాగ్దానాలతో దారుణంగా మోసపోయిన రైతులు, డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు అండగా ఉండేందుకే తాను దీక్ష చేపట్టినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. దూరాన్ని, ఎండను సైతం లెక్కచేయకుండా దీక్షకు తరలి వచ్చిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేందుకు ఎలా అబద్దాలు చెప్పారో అందరికీ తెలుసునని, ఆయన మాటలు నమ్మి రైతులు, డ్వాక్రా మహిళలు మోసపోయారని అన్నారు. వారందరికి అండగా నిలబడేందుకే తాను దీక్ష చేపట్టినట్లు చెప్పారు. అంతకు ముందు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు మండల, జిల్లా కేంద్రాలు ముట్టడి కార్యక్రమం చేపట్టామని, అందులో భాగంగానే రెండురోజుల పాటు రైతుదీక్ష చేస్తున్నామన్నారు. రుణమాఫీ సాకుతో చంద్రబాబు .. రైతులు, డ్వాక్రా మహిళలను ఎలా మోసం చేశారనే విషయాన్ని వాళ్లు వేదికపైకి వచ్చి చెప్పాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు.
మరోవైపు వైఎస్ జగన్ రైతుదీక్షకు సంఘీభావం తెలిపేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి రైతులు, మహిళలు తణుకు పట్టణానికి చేరుకున్నారు. రైతులు, మహిళలతోపాటు మరోవైపు యువకులు కూడా భారీఎత్తున తణుకు తరలి వచ్చారు. దీంతో కనీవినీ ఎరుగనిరీతిలో తణుకు పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి.