9న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలను ఏప్రిల్ 9న కౌంటింగ్తో పాటు, ఫలితాలు వెల్లడించాలని హైకోర్టు తీర్పు వెలువరించింది. ఎన్నికల సంఘం వినిపించిన వాదనను పరిశీలించకుండా ఉండలేమని తేల్చిచెప్పింది. ఎన్నికల ఫలితాలతో ఓటర్లు ప్రభావితం అవుతారన్న పిటిషనర్ల వాదన అసంబద్దమని పేర్కొంది.
ఫలితాల వెల్లడిపై ఈరోజు న్యాయస్థానంలో వాదనలు కొనసాగాయి. ఏప్రిల్ 10లోగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయమని గతంలో ధర్మాసనం తీర్పు ఇచ్చిందని కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఇప్పుడు అదే న్యాయస్థానం గతంలో తానిచ్చిన ఆదేశాలను సవరించగలదా అని పిటిషన్ తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. ఏప్రిల్ 10 లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయమని గతంలో తామిచ్చిన ఆదేశాలను సవరించలేమని కోర్టు స్పష్టం చేసింది.
అయితే ఆర్టికల్ 32 ప్రకారం ఇచ్చిన తీర్పును పునసమీక్షించే అధికారం సుప్రీంకోర్టుకు ఉందని, అదే నిబంధనల ప్రకారం హైకోర్టు కూడా చేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. కాగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మీ వైఖరి తెలపాలని ఎన్నికల కమిషన్ ను కోర్టు ప్రశ్నించింది.