‘చావో.. రేవో.. చంద్రబాబును నిద్రపోనివ్వొద్దు’
కర్నూలు: పార్టీలను పక్కకుపెట్టి కాపులందరం ఒక్కటవ్వాలని కాపు ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు. కాపుల రిజర్వేషన్ సాధించేవరకు కాపు జాతి నిద్ర పోకూడదని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని నిద్రపోనివ్వొద్దని, ఈ ఉద్యమంలో చావో రేవో ఏదో ఒకటి తేల్చుకొని తీరుదామని అన్నారు. ఆదివారం కర్నూలులోని కాపు సత్యగ్రహ దీక్షలో పాల్గొన్న సందర్భంగా ముద్రగడ మాట్లాడారు. కాపులకు ఇచ్చిన రిజర్వేషన్ హామీలు నెరవేర్చాలని అడుగుతుంటే రకరకాల బాధలను చంద్రబాబు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాపుల కళ్లల్లో ఆనందరం చూసేందుకు ఎన్ని బాధలైనా, ఎన్ని అవమానాలైన భరిస్తానని చెప్పారు.
కాపు కులంలో పుట్టిన తాను కాపుల రుణం తీర్చుకొని తీరుతానని స్పష్టం చేశారు. కాపు ఓట్లతో కుర్చీ ఎక్కిన చంద్రబాబు ఇప్పుడు మాట తప్పుతున్నారని, ఓవైపు కాపులకు ఉయ్యాల ఊపుతూనే మరోవైపు బీసీలను రెచ్చగొడుతున్నారని అన్నారు. తాను పుట్టిన కాపు జాతికి న్యాయం చేసేందుకే రోడ్డెక్కానని, తన ఊపిరి ఉన్నంత వరకు కాపు జాతికోసమే పనిచేస్తానని స్పష్టం చేశారు.
బీసీలకు ఎలాంటి నష్టం కలిగించకుండా కాపులకు రిజర్వేషన్స్ కల్పించాలని చంద్రబాబును కోరుతున్నామని చెప్పారు. నీలం సంజీవరెడ్డి కాపులకు రద్దు చేసిన బీసీ రిజర్వేషన్ లను దామోదరం సంజీవయ్య పునరుద్ధరించారని గుర్తు చేశారు. కఠిన నిర్ణయాలు తీసుకునే పరిస్థితిని చంద్రబాబు మాత్రమే కల్పిస్తున్నారని, చావో రేవో ఏదో ఒకటి తేల్చుకుందామని, చంద్రబాబును నిద్ర పోనివ్వకుండా చేద్దామని పునరుద్ఘాటించారు.