గత నెలలో మెట్టకు వచ్చిన ఎమ్మెస్

గత నెలలో మెట్టకు వచ్చిన ఎమ్మెస్




జగ్గంపేట :

తన హాస్యంతో థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించే ఎమ్మెస్ నారాయణ మృతితో ఆయన అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. గత ఏడాది డిసెంబర్ 25న జిల్లాకు వచ్చిన ఆయన ఏలేశ్వరం, జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామాల్లో సర దాగా గడిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను ఆయన స్వగృహానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. రాజకీయాల్లో ఎదురు లేని నెహ్రూ అంటే తనకు ప్రత్యేక అభిమానమని, అందుకే సందర్భం లేకుండా కలిసేందుకు వచ్చానని అప్పట్లో ఆయన చెప్పారు. ఎమ్మెస్ మృతి వార్త తెలుసుకున్న అభిమానులు, ఇటీవల ఇర్రిపాకలో కలిసినవారు ఆయన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్నారు.



కడియం : ఎమ్మెస్ నారాయణ మృతి మండలంలో విషాదాన్ని నింపింది. ఎమ్మెస్ కుమారుడు హీరోగా నటించిన ‘కొడుకు’ సినిమా షూటింగ్ స్థానిక పల్ల వెంకన్న నర్సరీలో వారం రోజుల పాటు సాగింది. ఎమ్మెస్ స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం షూటింగ్ సందర్భంగా పలువురు నర్సరీ రైతులకు ఆయన పరిచయస్తులయ్యారు. ఆయన హఠాన్మరణంతో వారంతా తీవ్ర విషాదం వ్యక్తం చేశారు. తమ నర్సరీలో వారం రోజులపాటు ఉన్నప్పుడు ఆయనతో గడిపిన క్షణాలు మరువలేమని పల్ల వెంకన్న నర్సరీ రైతు పల్ల సత్తిబాబు గుర్తు చేసుకున్నారు. ఇదిలా ఉండగా ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కుమారుడు ఆర్యన్ రాజేష్ వివాహ నిశ్చితార్థం 2012 జనవరిలో మండలంలోని జేగురుపాడులో జరిగింది. దీనికి వచ్చిన ఎమ్మెస్ అక్కడ నవ్వులపువ్వులు పూయించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top