తల్లీ, తనయుని హత్య..!

తల్లీ, తనయుని హత్య..! - Sakshi


గాలివీడు: కుటుంబ కలహాలు తల్లీ, తనయుల మృతికి దారితీశాయి. తన కుమార్తెను అల్లుడి మొదటి భార్య నవనీత, అల్లుడి సోదరులు ఆదిరెడ్డి, తాతిరెడ్డి పథకం ప్రకారం హత్య చేసి బావిలో వేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లి ఆరోపిస్తోంది. అయితే కుటుంబ కలహాల కారణంగానే తల్లీ, తనయులు ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. మండలంలోని ప్యారంపల్లె పంచాయతీ మజ్జిగ వారిపల్లెకు చెందిన మజ్జిగ బయ్యారెడ్డి రెండవ భార్య పూజిత (30) ఆమె కుమారుడు భానుప్రసాద్‌రెడ్డి(6) గ్రామం సమీపంలోని వ్యవసాయ బావిలో శుక్రవారం ఉదయం శవాలై తేలారు. వీరిది హత్యా.. లేక ఆత్మహత్యా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

 

 స్థానికుల వివరాల మేరకు.. మజ్జిగవారిపల్లెకు చెందిన బయ్యారెడ్డి అదే పంచాయతీ ఆవుల వాండ్లపల్లెకు చెందిన నవనీతను వివాహం చేసుకున్నాడు. వీరికి ప్రియాంక (15) అనే కుమార్తె ఉంది. వారసులు లేరనే కారణంతో మొదటి భార్య నవనీతను ఒప్పించి అనంతపురం జిల్లా తలుపుల మండలం పులిగండ్ల వారి పల్లెకు చెందిన ప్రసాద్‌రెడ్డి కుమార్తె పూజితను బయ్యారెడ్డి రెండో  వివాహం చేసుకున్నాడు. వీరికి తనూష(8)అనే కుమార్తెతో పాటు భానుప్రసాద్‌రెడ్డి (6) అనే కుమారుడు కలిగారు.

 

అలాగే నవనీతకు కూడా బబ్లు (4) అనే కుమారుడు పుట్టాడు. బయ్యారెడ్డి అతని రెండవ భార్య పూజిత ఇద్దరూ బతుకు దెరువు కోసం ఐదేళ్ల క్రితం గల్ఫ్ దేశాలకు వెళ్లారు. దీంతో పూజిత పిల్లలు తనూష, భాను ప్రసాద్‌రెడ్డి అమ్మమ్మ  వద్ద(ఎనుముల వారిపల్లె) పెరుగుతుండే వారు. ఆరు నెలల క్రితం ఇంటికి వచ్చిన బయ్యారెడ్డి మళ్లీ నెలక్రితం గల్ఫ్‌కు వెళ్ళాడు. నాలుగు నెలల క్రితం పూజిత కూడా ఇంటికి వచ్చింది. మళ్లీ గల్ఫ్‌కు వెళ్లడానికి పూజిత ప్రయత్నించగా బయ్యారెడ్డి ఒప్పుకోలేదు. ఆమె పాస్‌పోర్టును చించేశాడు. ఈ నేపధ్యంలో జూలై 23వ తేదీన కుటుంబసభ్యులతో పూజిత గొడవ పడింది. పోలీస్‌స్టేషన్‌లో రాజీ అయ్యారు. బుధవారం నుంచి పూజిత ఆమె కుమారుడు భానుప్రకాష్‌రెడ్డి గ్రామంలో కనబడ లేదు. ఖాదర్ భాషా అనే వ్యక్తికి చెందిన వ్యవసాయ బావిలో తల్లీ తనయుడు మరణించి ఉండటాన్ని శుక్రవారం గ్రామస్తులు గమనించారు.

 

 సమాచారం తెలిసిన వెంటనే వీఆర్‌ఓ వెంకటనారాయణ, లక్కిరెడ్డిపల్లె  సీఐ వినయ్ కుమార్‌రెడ్డి, గాలివీడు ఎస్‌ఐ రెడ్డి సురేష్, ఏఎస్‌ఐలు సుబ్బరాయుడు, రఘు రామయ్య బావి వద్దకు  వెళ్లి తల్లీతనయుల శవాలను వెలికి తీయించారు. కాగా వీరి ముఖాలపై రక్త గాయాలుండడం, కళ్లు ఉబ్బిపోయి ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన కుమార్తెను, మనమడిని ఆమె బావ ఆదిరెడ్డి, మరిది  తాతిరెడ్డి, అల్లుని మెదటి భార్య నవనీత పధకం ప్రకారం చంపి ఆత్మహత్య చేసుకున్నట్లు కట్టు కథ అల్లుతున్నారని పూజిత తల్లి గంగులమ్మ, ఆమె సోదరుడు ప్రసాద్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రాయచోటి ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top