సహాయక కార్యక్రమాలు సిటీకే పరిమితం: మోపిదేవి
విశాఖపట్నం: తుపాను సహాయ కార్యక్రమాలు సిటీకే పరిమితమయ్యాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మోపిదేవి వెంకటరమణ ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో తుపాను సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. హుదూద్ తుపాను ఉత్తరాంధ్ర జిల్లాలను అతలాకుతలం చేస్తే కేవలం సహాయక చర్యలు విశాఖపట్నం నగరంలోనే చేపట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం హుదూద్ తుపానుతో దెబ్బతిన్న ప్రాంతాల్లో వెంకటరమణ పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్యుమరేషన్, సహాయ కార్యక్రమాలు రాజకీయ కోణాల్లో జరగుతున్నాయని వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. తుపాను బాధితులకు నష్టపరిహారం చెల్లించే సమయంలో బ్యాంకులతో మెలిక పెట్టవద్దని ప్రభుత్వానికి సూచించారు. కోపరేటివ్ సొసైటీలో సభ్యుత్వం ఉన్నవారికే... ఎండు చేపలు విక్రయించే మహిళలకు పరిహారం చెల్లిస్తామంటున్నారని ప్రశ్నించారు. ఇది సరైన పద్దతి కాదని ఆయన అభిప్రాయడ్డారు. మత్స్యకారులకు మోడల్ హౌసెస్ తరహాలో కాలనీలు ఏర్పాటు చేయాలని వెంకట రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సముద్రపు కోతకు గరైన ప్రాంతాల్లో రక్షణ గోడ నిర్మించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.