కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ వెంటే...


 విజయనగరం మున్సిపాలిటీ  : నియోజకవర్గం అభివృద్ధి పేరుతో వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి మారిన ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇచ్చి పోటీ చేయిస్తే ఆ పార్టీ నిలువునా చీలిపోవటం ఖాయమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మె ల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అ న్నారు. భవిష్యత్‌లో ఉప ఎన్నికలు జరిగినా... 2019 సంవత్సరంలో సార్వ త్రిక ఎన్నికలు జరిగినా టీడీపీకి అదే గతి పడుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ లు మారినా నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ వెంటే ఉంటారని 2019 ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావటం ఖా యమని ధీమా వ్యక్తం చేశారు.

 

 పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు శనివారం రాత్రి పట్టణంలోని హోటల్ మయూరాలో నిర్వహించిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో కోలగట్ల మాట్లాడుతూ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి న చంద్రబాబు అనతికాలంలో ప్రజావిశ్వాసాన్ని కోల్పోయారనీ, ప్రజల దృష్టిని మరల్చేందుకు, ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్షాన్ని లేకుండా చేసేందుకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని తూర్పారబట్టారు. రాష్ట్రంలో జరుగుతున్న అప్రజాస్వామిక రాజకీయ పరిణామాలపై కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు అన్ని రాజకీయ పార్టీల దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిపారు.

 

  ఈ క్షణం ఎన్నికలు నిర్వహిస్తే ఘోరపరాజయం తప్పదన్న భయంతోనే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ పాలకవర్గాల ఏర్పాటుకు వెనుకడుగు వేస్తున్నట్లు చెప్పారు.   జిల్లాకు చెందిన ఇద్దరు ఎస్టీ ఎమ్మెల్యేలు పార్టీని వీడకుండా మద్దతు పలికినందుకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే బొబ్బిలి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో తాగునీటి ఎద్దడి ఎక్కువగా ఉందనీ, ఈ సమస్యపై మే రెండో తేదీన అన్ని మండల రెవెన్యూ కార్యాలయాలు, మునిసిపల్ కార్యాలయాల వద్ద ధర్నా చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

 

 జన్మభూమి కమిటీ అక్రమాలే వైఎస్సార్‌సీపీ విజయానికి పునాదులు: రాజన్నదొర

 సమావేశంలో సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర మాట్లాడుతూ పల్లెల్లో జన్మభూమి కమిటీలు చేస్తున్న అక్రమాలు, అరాచకాలు, రాజకీయ కక్షసాధింపులే వైఎస్సార్‌సీపీ విజయానికి సోపానాలుగా మారుతాయన్నారు. నియోజకవర్గ అభివృద్ధి పేరుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు చివరికి శూన్య హస్తాలతో మిగిలిపోవటం ఖాయమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందనీ, ఆ అవకాశాన్ని ప్రతిపక్ష పార్టీగా సద్వినియోగం చేసుకునే దిశగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నా రాజకీయ మేధావులు, ఉద్ధండులు మౌనంగా ఉండటం దురదృష్టకరమని వాఖ్యానించారు.

  పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు మాట్లాడుతూ బొబ్బిలిలో పార్టీ పాగా వేయటం ఖాయమని, అక్కడ వైఎస్సార్‌సీపీకి అపూర్వ ఆదరణ ఉందనీ తెలిపారు. పార్టీ పిలుపు మేరకు చేపట్టే కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు.

 

 పార్టీ విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తోందనీ అందుకు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదనీ అన్నారు. కొత్తగా పార్టీలోకి చేరుతున్న ఎమ్మెల్యేలకు త్వరలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని ఆ స్థానాల్లో టికెట్లు కేటాయిస్తామని చెబుతున్నారని, అది 2026 వరకు జరగదని సుప్రీం కోర్టు తేల్చిచెప్పటం చెంపపెట్టన్నారు. పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి శత్రుచర్ల పరీక్షిత్‌రాజు మాట్లాడుతూ ఫ్యాన్ గుర్తుపై పోటీ చేసిన గెలిచిన ఎమ్మెల్యేలు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. రానున్న మూడేళ్లు పార్టీ కోసం పని చేసి జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయటమే ఏకైక లక్ష్యంగా పని చేయాలన్నారు.

 

  పార్టీ నాయకుడు మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో 2019 ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పార్టీని విజయపథంలో నడిపించేందుకు అంతా కలిసిగట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. బొబ్బిలిలో ఉప ఎన్నిక రానుందని, అక్కడ పార్టీ అభ్యర్థిని గెలిపించటమే ధ్యేయం కావాలన్నారు. సమావేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములునాయుడు, నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ పెనుమత్స సురేష్, ఎస్.కోట ఇన్‌చార్జి నెక్కల నాయుడుబాబు, పార్వతీపురం ఇన్‌ఛార్జి జమ్మాన ప్రసన్నకుమార్, వర్రి నర్సింహమూర్తి తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వి.సూర్యనారాయణరాజు, వేచలపు చినరామునాయుడు, డీసీసీబీ ఉపాధ్యక్షుడు చనుమళ్ల వెంకటరమణ, విజయనగరం పట్టణ అధ్యక్షుడు ఆశపు వేణు, సాలూరు పట్టణ అధ్యక్షుడు జరజాపు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top