ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
కర్నూలు(అగ్రికల్చర్): శాసనమండలి స్థానిక సంస్థల నియోజకవర్గం ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రం 4 గంటలతో ముగిసింది. శుక్రవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కర్నూలు, ఆదోని, నంద్యాల ఆర్డీఓ కార్యాలయాల్లోని సమావేశ భవనాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారం ముగియడంతో ఓటర్ల కదలికలను గమనించేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఫ్లయింగ్ స్క్వాడ్స్, ఇతర నిఘా బృందాల సభ్యులకు సెల్ఫోన్లు ఇచ్చి ఓటర్ల కదలికలను చిత్రీకరించాలని కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ ఆదేశించారు.
జిల్లాలో మొత్తం 1,087 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. అయితే ఇందులో 116 మంది ఓటర్లు సహాయకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులపై రిటర్నింగ్ అధికారి, జేసీ హరికిరణ్ విచారణ జరిపిస్తున్నారు. ఇందులో ఎంతమందికి సహాయకులను నియమిస్తారనేది తెలియరాలేదు. గురువారం ఉదయానికి సహాయకుల నియామకంపై స్పష్టత రానుంది.
నేడుమెటీరియల్ పంపిణీ...
పోలింగ్ సామగ్రిని గురువారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో పంపిణీ చేయనున్నారు. మూడు పోలింగ్ కేంద్రాల పీవో, ఏపీఓలకు పోలింగ్ నిర్వహణకు అవసరమైన మెటీరియల్ను అందజేస్తారు. రాత్రికే పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంది.