కొండపి ఎమ్మెల్యే స్వామికి త్రుటిలో తప్పిన ప్రమాదం

కొండపి ఎమ్మెల్యే స్వామికి త్రుటిలో తప్పిన ప్రమాదం


ముందు వెళ్తున్న లారీని ఢీకొన్న ఎమ్మెల్యే కారు

స్వల్ప గాయాలతో బయటపడిన ఎమ్మెల్యే  

కారులో ఎమ్మెల్యేతో పాటు మరో ముగ్గురు

 

 ఒంగోలు క్రైం : కొండపి ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యుడు డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామికి నగరానికి సమీపంలోని చెర్వుకొమ్ముపాలెం జంక్షన్ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ప్రమాదం త్రుటిలో తప్పింది. వేగంగా వస్తున్న ఎమ్మెల్యే కారు ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొంది. కారులోని బెలూన్లు ఓపెన్ కావటంతో పెను ప్రమాదం నుంచి ఎమ్మెల్యే బయట పడగలిగారు. ఎమ్మెల్యే స్వామికి స్వల్ప గాయాలయ్యాయి. ముఖం మీద దవడ ఎముక స్వల్పంగా దెబ్బతింది. హుటాహుటిన మరో కారులో చికిత్స కోసం ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్చారు. 



టంగుటూరు నుంచి రాత్రి 9 గంటల సమయంలో ఒంగోలు వస్తుండగా ప్రమాదం జరిగింది. వంద కిలోమీటర్లకు పైగా వేగంగా వస్తున్న ఎమ్మెల్యే కారు బలంగా లారీని ఢీకొంది. చెరువుకొమ్ముపాలెం జంక్షన్ వద్ద ముందు వెళ్తున్న లారీకి ఓ ఆటో అడ్డం వచ్చింది. దీంతో లారీ డ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేశాడు. ఆ వెనుకే వస్తున్న ఎమ్మెల్యే కారు లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు కారులో ఎమ్మెల్యే స్వామి ముందు సీట్లో కూర్చొని ఉన్నారు. డ్రైవర్‌తో పాటు ఇద్దరు గన్‌మన్లు ఉన్నారు. కారులో ఉన్న మరెవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఒంగోలు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పలువురు అధికారులు, నాయకులు వైద్యశాలకు వెళ్లి ఎమ్మెల్యేను పరామర్శించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top