అసెంబ్లీలో సీఎంను నిలదీస్తా
ఎమ్మెల్యే సునీల్ దీక్ష భగ్నం
చిత్తూరు ఆస్పత్రిలో చికిత్స
చిత్తూరు (అర్బన్): ఐరాల మండలంలో పింఛన్లు తొలగింపుపై అసెంబ్లీలో సీఎంను నిలదీస్తానని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ చెప్పారు. ఐరాలలో ఎమ్మెల్యే సునీల్ నిరాహార దీక్షను శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేసి చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యులు సునీల్కుమార్కు వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్తపోటు, చక్కెర స్థాయిలు తగ్గినట్టు వైద్యులు పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యుల సూచన మేరకు సునీల్కుమార్కు ఫ్లూయిడ్స్ పెట్టారు.
ప్రథమ చికిత్స అనంతరం ఎమ్మెల్యేను ఆస్పత్రిలోని ఎంఎస్ వార్డు ఏ క్లాస్ గదికి తరలించి అడ్మిట్ చేశారు. పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పరామర్శించారు. ఎమ్మెల్యేకు ఆస్పత్రిలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధికారి ప్రతినిధి తలపులపల్లె బాబు రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పీవీ.గాయత్రీదేవి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో పింఛన్లు సమస్యపై చర్చిస్తానన్నారు. లబ్ధిదారులు ఇచ్చిన అర్జీలన్నీ సీఎం ముందు వేసి ఆయన్నే ప్రశ్నిస్తానని చెప్పారు.